షెఫాలీ వర్మ (81; 48 బంతుల్లో, 12 ఫోర్లు, 1 సిక్సర్) విధ్వంసం సృష్టించడంతో నేపాల్కు భారత్ 179 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. మహిళల ఆసియా కప్లో భాగంగా ఇవాళ నేపాల్తో జరుగుతున్న గ్రూప్ మ్యాచ్లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 178 పరుగులు చేసింది. హేమలత (47; 42 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్సర్) రాణించింది.
అయితే శుభారంభానికి తగ్గట్లుగా ఇన్నింగ్స్ను భారత్ గొప్పగా ముగించలేకపోయింది. ఓపెనర్లు షెపాలీ, హేమలత తొలి వికెట్కు శతక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 14 ఓవర్లో వీరిద్దరు 122 పరుగులు చేశారు. ఆది నుంచే షెఫాలీ దూకుడుగా ఆడగా, హేమలత నిలకడగా ఆడింది. తొలి ఓవర్ నుంచే షెఫాలీ బౌండరీ మోత మోగించింది.

దీంతో భారత్ పవర్ప్లేలో 50 పరుగులు చేసింది. కాగా, పవర్ప్లే అనంతరం హేమలత కూడా గేర్ మార్చడంతో పరుగులు పోటెత్తాయి. 11 ఓవర్లకే టీమిండియా 100 పరుగుల మార్క్ను అందుకుంది. ఈ క్రమంలో షెఫాలీ 26 బంతుల్లో అర్ధశతకం సాధించింది. అయితే వేగంగా పరుగులు సాధించే ప్రయత్నంలో హేమలత పెవిలియన్కు చేరింది. కాసేపటికే షెపాలీ కూడా వెనుదిరిగింది.
వన్డౌన్లో వచ్చిన సంజన (10; 12 బంతుల్లో, 1 ఫోర్) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయింది. దీంతో స్కోరు వేగం తగ్గింది. అయితే ఆఖర్లో జెమీమా రోడ్రిగ్స్ (28 నాటౌట్; 15 బంతుల్లో, 5 ఫోర్లు) చెలరేగింది. బౌండరీలతో విరుచుకుపడి నేపాల్ ముంగిట కొండంత లక్ష్యాన్ని నిర్దేశించింది. నేపాల్ బౌలర్లలో సీతా రంగా రెండు వికెట్లు, కబితా జోషి ఒక వికెట్ తీశారు.