మహిళల ఆసియా కప్-2024లో పాకిస్థాన్ బ్యాటర్లను టీమిండియా బౌలర్లు వణికించారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాక్ పరుగులు చేయడానికి చెమటోడ్చింది. అయితే ఆఖర్లో ఫాతిమా సాహా (22 నాటౌట్; 16 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) దూకుడుగా పరుగులు చేయడంతో భారత్ ముందు పాకిస్థాన్ పోరాడే స్కోరు ఉంచింది.
దంబుల్లా వేదికగా శుక్రవారం జరుగుతున్న మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.2 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. సిద్రా అమీన్ (25; 35 బంతుల్లో, 3 ఫోర్లు) టాప్ స్కోరర్. దీప్తి శర్మ (3/20) మూడు వికెట్లతో చెలరేగింది. రేణుక ఠాకూర్ (2/14), పూజ వస్త్రాకర్ (2/31), శ్రేయాంక పాటిల్ (2/14) తలో రెండు వికెట్లు తీశారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ను పూజ ఆదిలోనే దెబ్బకొట్టింది. ఓపెనర్లు గుల్ ఫిరోజా (6; 5 బంతుల్లో, 1 ఫోర్), మునీబా (11; 11 బంతుల్లో, 2 ఫోర్లు)ను పెవిలియన్కు చేర్చింది. ఆ తర్వాత వికెట్ల వేటలో స్పిన్నర్లు శ్రేయాంక, దీప్తి శర్మ కూడా చేరడంతో పాకిస్థాన్ బ్యాటర్లు విలవిలలాడారు. 61 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన టుబా హసన్ (22; 19 బంతుల్లో, 3 ఫోర్లు), ఫతిమా ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించారు. వీరిద్దరు ఏడో వికెట్కు 31 పరుగులు జోడించారు. దీంతో పాక్ 92/6తో పుంజుకునే స్థితికి చేరుకుంది. కానీ భారత బౌలర్లు మరోసారి విజృంభించి క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టి 94/9 పాక్ను పడగొట్టారు. అయితే 19వ ఓవర్ వేసిన రాధా బౌలింగ్లో ఫాతిమా వరుసగా రెండు సిక్సర్లు సాధించి జట్టుకు విలువైన పరుగులు అందించింది.