Women Tri Series 2025: ముక్కోణపు సిరీస్ ఫైనల్లో భారత మహిళా క్రికెట్ స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన సెంచరీ సాధించింది. స్మృతి మంధాన 92 బంతుల్లో ఈ సెంచరీని పూర్తి చేసింది. ఆ సమయంలో స్మృతి బ్యాట్ నుంచి 12 ఫోర్లు, 2 సిక్సర్లు వచ్చాయి. ఇది స్మృతి మంధానకు వన్డే కెరీర్లో 11వ సెంచరీ కావడం గమనార్హం. స్మృతి మంధాన 101 బంతుల్లో 116 పరుగులు చేసి ఔట్ అయింది. అనంతరం డుమీ విహంగ బౌలింగ్లో హర్షిత మాధవికి క్యాచ్ ఇచ్చి ఔట్ అయింది.
భారత్, శ్రీలంక, దక్షిణాఫ్రికా దేశాల మధ్య ముక్కోణపు సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మూడు జట్లు నాలుగేసి మ్యాచ్లు ఆడిన అనంతరం భారత్, శ్రీలంక జట్లు ఫైనల్ చేరుకున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్ నేడు కొలంబో వేదికగా జరుగుతోంది. భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ప్రతీకా రావల్, స్మృతి మంధానలు ఓపెనర్లుగా భారత్ కు గొప్ప ఆరంభాన్నిఅందించారు. వీరిద్దరు తొలి వికెట్కు 70 పరుగులు జోడించారు. ఇనోకా రణవీర ఈ పార్టనర్ షిప్ను విడగొట్టింది. 15వ ఓవర్లో ప్రతీకా రావల్ను పెవిలియన్ కు పంపించింది. ప్రతీకా రావల్ 49 బంతుల్లో 2 ఫోర్లతో 30 పరుగులు చేసింది.

మొదటి వికెట్ పడిపోయిన తర్వాత స్మృతి మంధాన, హర్లీన్ డియోల్ కలిసి రెండో వికెట్కు 120 పరుగులు జోడించింది. ఈ సమయంలో స్మృతి మంధాన తన అర్థసెంచరీని పూర్తి చేసింది. తర్వాత తన సెంచరీని పూర్తి చేసింది. 31వ ఓవర్ మొదటి మూడు బంతుల్లో 3 ఫోర్లు కొట్టడం ద్వారా స్మృతి మంధాన ఈ సెంచరీని పూర్తి చేసింది. ఆ ఓవర్లో స్మృతి వరుసగా 4 ఫోర్లు కొట్టింది. డుమీ విహంగా బౌలింగ్లో హర్షిత మాధవికి క్యాచ్ ఇచ్చి స్మృతి మంధాన పెవిలియన్ చేరింది. ఈ ఫైనల్ మ్యాచ్లో భారత్ భారీస్కోరు దిశగా దూసుకెళ్తోంది. 40.5 ఓవర్లలో భారత్ 3 వికెట్లు 263 పరుగులు చేయగలిగింది. మరీ 50 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక ముందు ఎంత లక్ష్యాన్ని ఉంచుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
స్మృతి మంధాన ఖాతాలో మరో రికార్డు
మహిళల వన్డే క్రికెట్ లో అత్యధిక సెంచరీలు చేసిన మూడో క్రీడాకారిణిగా స్మృతి మంధాన నిలిచింది. స్మృతి కంటే ముందు న్యూజిలాండ్ కు చెందిన సుజీ బేట్స్, ఆస్ట్రేలియాకు చెందిన మెగ్ లానింగ్ ఉన్నారు. మెగ్ లానింగ్ 15 సెంచరీలు సాధించగా.. సుజీ బేట్స్ 13 సెంచరీలు సాధించారు.
తుది జట్లు ఇవే..
భారత ప్లేయింగ్-11: ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, స్నేహ్ రాణా, శ్రీ చరణి, క్రాంతి గౌడ్.
శ్రీలంక ప్లేయింగ్-11: హాసిని పెరెరా, విషమి గుణరత్నే, హర్షిత సమరవిక్రమ, చమరి అటపట్టు (కెప్టెన్), పియుమి బదల్గే, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని (వికెట్ కీపర్), దేవ్మీ విహంగ, సుగండిక కుమారి, మల్కీ మదార, ఇనోకా రణవీర.