హైదరాబాద్: ఉమెన్ వరల్డ్ కప్లో భాగంగా న్యూజిలాండ్తో శనివారం జరిగిన మ్యాచ్లో మిథాలీ సేన 186 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 266 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 25.3 ఓవర్లలో 79 పరుగులకే ఆలౌటైంది. తాజా విజయంతో మిథాలీ సేన వరల్డ్ కప్ సెమీస్కు చేరుకుంది.
భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ ఐదు వికెట్లు తీయగా దీప్తి శర్మ 2, శిఖాపాండే, గోస్వామి, పూనమ్ యాదవ్ చెరో వికెట్ తీశారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. సెమీస్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో న్యూజిలాండ్ ముగింట భారీ లక్ష్యాన్ని ఉంచింది.
ఓపెనర్లు పూనమ్ రౌత్ (4), స్మృతి మందాన (13) జట్టు స్కోరు 21 పరుగుల వద్దే పెవిలియన్ చేరుకున్నారు. పూనమ్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మిథాలీ రాజ్ (109), హర్మన్ ప్రీత్ (60)తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పింది. వీరిద్దరి జోడీ మూడో వికెట్కు 132 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.
మిథాలీ రాజ్కి ఇది వన్డేల్లో ఆరో సెంచరీ కాగా, వరల్డ్ కప్ టోర్నీల్లో రెండో సెంచరీ కావడం విశేషం. మిథాలీకి హర్మన్ప్రీత్ అర్ధ సెంచరీ చేసి చక్కని సహకారం అందించింది. అయితే జట్టు స్కోరు 153 వద్ద కస్పెరిక్ బౌలింగ్లో ఆమెకే రిటన్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్కి చేరింది. ఆ తర్వాత పరుగు తేడాతోనే దీప్తి శర్మ డకౌట్గా వెనుదిరిగింది.
సుష్మ నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన వేద కృష్ణమూర్తి (70) చివర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. తొలుత నిలకడగా ఆడిన వేద కృష్ణమూర్తి చివరి పది ఓవర్లలో చెలరేగి ఆడింది. హ్యాట్రిక్ ఫోర్లతో విరుచుకుపడింది. మిథాలీతో కలిసి ఐదో వికెట్కు 108 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.
వేద మెరుపు ఇన్నింగ్స్తో 46వ ఓవర్లో 16, 47వ ఓవర్లో 17 ఇలా మొత్తం 33 పరుగులు వచ్చేశాయి. చివరి ఓవర్లో 3 వికెట్లు పోయినా అప్పటికే భారత్ భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్లో సెంచరీ చేసిన కెప్టెన్ మిథాలీ రాజ్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
Introducing #WWC17 semi finalists.... @BCCIWomen! 👏👏👏 pic.twitter.com/uXiKxA2n8W
— Cricket World Cup (@cricketworldcup) July 15, 2017
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన మిథాలీ సేన
ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా శనివారం టీమిండియా, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. డెర్బీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. టోర్నీలో వరుసగా నాలుగు విజయాలతో ఘనంగా ఆరంభించిన టీమిండియా అనూహ్యంగా తడబడి సెమీస్ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది.
పేలవ బ్యాటింగ్, బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ లోపాలతో చివరిగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల చేతిలో ఘోర ఓటమి చవిచూసింది. దీంతో శనివారం న్యూజిలాండ్తో జరగనున్న లీగ్ చివరి మ్యాచ్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్పై విజయం సాధిస్తే సెమీస్కు, ఓడితే ఇంటిబాట పడుతుంది.
ఇరు జట్లకూ ఇదే చివరి లీగ్ మ్యాచ్ కావడం విశేషం. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఇప్పటికే సెమీస్ చేరుకోగా నాలుగో బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ తలపడుతున్నాయి. భారత్ ఖాతాలో 8 పాయింట్లతో ఉండగా న్యూజిలాండ్ ఖాతాలో 7 పాయింట్లు ఉన్నాయి. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే.. పట్టికలో మెరుగైన స్థానంలో ఉన్న భారత్ సెమీస్ చేరుతుంది.
తొలి రెండు మ్యాచ్ల్లోనూ భారీ స్కోర్లతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ స్మృతి మందనా.. చివరిగా నాలుగు మ్యాచ్ల్లోనూ సింగిల్ డిజిట్కే పరిమితమవడంతో భారత్పై ఒత్తిడి పెరుగుతోంది. కెప్టెన్ మిథాలీ రాజ్, మరో ఓపెనర్ పూనమ్ రౌత్ నిలకడగా ఆడుతున్నా.. వీరికి సహకరించే వారు కరవయ్యారు. టాప్ ఆర్డర్ నిలకడగా రాణించలేకపోతోంది.
జట్ల వివరాలు:
టీమిండియా:
INDw XI: S Mandhana, P Raut, M Raj, H Kaur, D Sharma, V Krishnamurthy, S Verma, S Pandey, J Goswami, R Gayakwad, P Yadav
— ICC Live Scores (@ICCLive) July 15, 2017
న్యూజిలాండ్:
NZw XI: S Bates, R Priest, A Satterthwaite, K Martin, S Devine, K Perkins, M Green, A Kerr, H Rowe, L Tahuhu, L Kasperek
— ICC Live Scores (@ICCLive) July 15, 2017