హైదరాబాద్: దశాబ్దానికిపైగా భారత మహిళా జట్టుకి ప్రాతినిథ్యం వహిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న కెప్టెన్ మిథాలీ రాజ్, వెటరన్ బౌలర్ ఝలన్ గోస్వామికి అరుదైన గౌరవం దక్కింది. ఇంగ్లాండ్లోని ప్రఖ్యాత లార్డ్స్ స్టేడియంలోని మ్యూజియంలో ఈ ఇద్దరి క్రికెటర్ల జెర్సీలను ప్రదర్శనకి ఉంచనున్నారు.
లార్డ్స్ వేదికగా ఆదివారం ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన ఫైనల్లో టీమిండియా 9 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం వరల్డ్ కప్ ఫైనల్లో వారు ధరించిన జెర్సీలపై సంతకం చేసి మిథాలీ రాజ్, జులన్ గోస్వామి మ్యూజియం సిబ్బందికి వాటిని అందజేసినట్లు ఐసీసీ వెల్లడించింది.

భారత మహిళా క్రికెట్కి ఆదరణ తెచ్చిన ఈ ఇద్దరు క్రికెటర్లు తమ కెరీర్లో మరో వరల్డ్ కప్ ఆడే అవకాశాలు లేవనే చెప్పాలి. ఇప్పటికే 33 ఏళ్లు పూర్తైన నేపథ్యంలో ఫిటెనెస్ దృష్ట్యా మరో నాలుగేళ్లు ఆటలో కొనసాగడం కష్టం. అందుకే ఫైనల్ అనంతరం ఐసీసీకి తమ జెర్సీలను అందజేసినట్లు తెలుస్తోంది.
ఈ మ్యాచ్లో ఝలన్ గోస్వామి మూడు వికెట్లు తీసి ఇంగ్లాండ్ జట్టుని తక్కువ స్కోరుకే కట్టడి చేసిన సంగతి తెలిసిందే. వన్డేల్లో 195 వికెట్లు తీసిన గోస్వామి, వరల్డ్ కప్ మ్యాచ్ల్లో 36 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన వారి జాబితాలో మూడో స్ధానంలో ఉంది.
ఇక, కెప్టెన్గా రెండు వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన మొదటి భారత క్రికెటర్గా చరిత్ర సృష్టించిన మిథాలీ రాజ్ 35వ పడికి చేరువగా ఉన్న మిథాలీ మరో వరల్డ్ కప్ ఆడే అవకాశం లేదు. ఇదే విషయాన్ని లార్డ్స్లో ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం మిథాలీనే స్వయంగా చెప్పింది. ప్రపంచకప్ కల నెరవేరకుండానే మిథాలీ క్రికెట్కు గుడ్బై చెప్పబోతుండటం ఆమె అభిమానుల్ని బాధించే విషయమే.