
దుబాయ్: మహిళల టీ20 ప్లేయర్ ర్యాంకింగ్స్ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం విడుదల చేసింది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో టీమిండియా యువ ఓపెనర్ షఫాలీ వర్మ మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్లో సత్తాచాటిన 17 ఏళ్ల షఫాలీ రేటింగ్ పాయింట్లను మెరుగుపరచుకొని నంబర్వన్ ర్యాంకు చేరుకుంది. గతేడాది టీ20 ప్రపంచకప్లో భారత్ నాకౌట్ చేరడంలో కీలకపాత్ర పోషించిన షఫాలీ.. అప్పుడు తొలిసారి టాప్ ర్యాంకు అందుకుంది.
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో షఫాలీ వర్మ 22 బంతుల్లో 23 పరుగులు చేసింది. ఆ మ్యాచులో రెండు ఫోర్లు, ఓ సిక్సర్ బాదింది. రెండో టీ20లో 31 బంతుల్లో 47 రన్స్ చేసి హాఫ్ సెంచరీ ముందు ఔట్ అయింది. షఫాలీ ఇన్నింగ్స్లో 6 ఫోర్లు, 2 సిక్స్లు ఉన్నాయి. క్రీజులోకి వచ్చిరావడంతోనే బౌండరీలతో విరుచుకుపడడం షఫాలీ ప్రత్యేకత. రెండు మ్యాచులలో సత్తాచాటిన షఫాలీ రేటింగ్ పాయింట్లను మెరుగుపరచుకొని నంబర్వన్ ర్యాంకు చేరుకుంది.
15 ఏళ్ల వయసులో భారత్ తరఫున అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడిన అతి పిన్న వయస్కురాలిగా షఫాలీ వర్మ రికార్డు సృష్టించింది. షఫాలీ 15 సంవత్సరాల 239 రోజుల వయస్సులో ఈ ఘనతను సాధించింది. అనతికాలంలోనే భారత జట్టుకు కీలక ప్లేయర్గా మారింది. బ్యాటర్ల ర్యాంకింగ్స్లో భారత్ నుంచి స్మృతి మంధాన ఏడో స్థానంలో ఉండగా.. జెమీమా రోడ్రిగ్స్ తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్లో దీప్తి శర్మ, రాధా యాదవ్ వరుసగా ఏడు, ఎనిమిదో స్థానంలో ఉన్నారు.
వరుసగా రెండు ఓటములతో ఇప్పటికే టీ20 సిరీస్ కోల్పోయిన భారత మహిళల క్రికెట్ జట్టు మంగళవారం ఓదార్పు విజయం కోసం బరిలోకి దిగనుంది. ఇప్పటికే వన్డే సిరీస్, టీ20 సిరీస్ కోల్పోయిన భారత మహిళలు.. ఆఖరి టీ20లో కూడా ఓడితే వైట్వాష్ అవుతుంది. సొంతమైదానంలో ఈ పరిస్థితి తప్పించుకొని పరువైనా కాపాడుకోవాలని భారత మహిళల క్రికెట్ జట్టు భావిస్తోంది. దాంతో సౌతాఫ్రికాతో మంగళవారం జరిగే చివరి, మూడో టీ20లో ఎలాగైనా గెలవాలని భావిస్తోంది.