
మ్యాచ్ రద్దు:
సిడ్నీ క్రికెట్ మైదానంలో ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కావాల్సిన భారత్-ఇంగ్లండ్ తొలి సెమీఫైనల్ మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారింది. సిడ్నీలో గత రాత్రి నుండి భారీ వర్షం కురుస్తుండటంతో టాస్ ఆలస్యం అయింది. మొదటగా అంపర్లు టాస్ కోసం కట్-ఆఫ్ సమయంను నిర్ణయించారు. ఆ సమయం వరకు కూడా వర్షం తగ్గలేదు. రిజర్వ్ డే లేకపోవడంతో మ్యాచ్ను ఎట్టిపరిస్థితుల్లోనే ఈరోజే నిర్వహించాలి. ఇక 10 ఓవర్లు మ్యాచ్ జరిగే పరిస్థితి కూడా లేకపోవడంతో అంపర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఫైనల్లో భారత్:
సెమీస్ మ్యాచ్ రద్దవడంతో గ్రూప్ -ఏ లో మెరుగైన పాయింట్లు సాధించిన భారత్ (8 పాయింట్లు) నేరుగా ఫైనల్కు దూసుకెళ్లింది. దీంతో భారత మహిళలు తొలిసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్లో అడుగుపెట్టారు. ఇక ఆదివారం ఫైనల్ మ్యాచ్ ఆడనున్నారు. మరోవైపు తొలి సెమీస్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో సెమీస్ కూడా ఇదే మైదానంలో జరగాలి. వర్షం తగ్గే సూచనలు కన్పించడం లేదని స్థానిక సమాచారం. రెండో సెమీస్ కూడా రద్దయితే.. సఫారిలు ఫైనల్కు వెళ్తారు. గ్రూప్-బిలో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.

నో రిజర్వ్ డే:
వర్షం ముప్పు నేపథ్యంలో సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్లకి 'రిజర్వ్ డే' ఉండాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కోరింది. కానీ.. ఐసీసీ మాత్రం సీఏ అభ్యర్థనని తిరస్కరించింది. షెడ్యూల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేసింది. దీంతో సీఏతో పాటు ఆస్ట్రేలియా జట్టుకు కూడా భారీ షాక్ తగిలింది.

ఆలస్యంగా మేలుకున్న సీఏ:
టోర్నీ ప్రారంభానికి ముందు అంగీకరించిన నిబంధనల్లో 'రిజర్వ్ డే' ప్రస్తావన లేదు. ఆలస్యంగా మేలుకున్న సీఏ.. తర్వాత రిజర్వ్ డే గురించి ఐసీసీని ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. ముందుగా అనుకున్నదాని ప్రకారం సెమీఫైనల్ మ్యాచ్ల కోసం రిజర్వ్ డే లేదని, చివరి నిమిషంలో షెడ్యూల్ మార్చలేమని ఐసీసీ స్పష్టం చేసింది. రిజర్వ్ డే పెడితే టోర్నీ వ్యవధి మరింత పెరుగుతుందని, ఇది అనవసరపు ఇబ్బందికి దారి తీస్తుందని వెల్లడించింది.


Click it and Unblock the Notifications












