
షార్జా: మహిళల టీ20 ఛాలెంజ్ 2020లో భాగంగా షార్జా వేదికగా వెలాసిటీతో జరుగుతున్న మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన సూపర్నోవాస్ సాధారణ స్కోరే చేసింది. వెలాసిటీ ఓపెనర్ చమరి ఆటపట్టు (44: 39 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (31: 27 బంతుల్లో 1ఫోర్, 2సిక్సర్లు) రాణించడంతో 20 ఓవర్లలో 8 వికెట్లకు 126 పరుగులు చేసింది. దీంతో వెలాసిటీ ముందు 127 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. వెలాసిటీ బౌలర్లలో జహానారా ఆలం (2/27), కాస్పెర్క్ (2/23) ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను కట్టడి చేశారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన హర్మన్సేనకు శుభారంభం లభించలేదు. ఓపెనర్ ప్రియ (11) ఆదిలోనే వెనుదిరగడంతో పవర్ప్లేలో వెలాసిటీ జట్టు 32 పరుగులు మాత్రమే చేసింది. తర్వాత క్రీజులోకి వచ్చిన జెమిమా రోడ్రిగ్స్ (7) కూడా ఎక్కువసేపు నిలవలేదు. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన హర్మన్ప్రీత్తో కలిసి చమరి ఇన్నింగ్స్ చక్కదిద్దింది. తొలుత నిదానంగా ఆడినా ఈ జోడి తర్వాత దూకుడుగా ఆడింది.
ముఖ్యంగా చమరి భారీ సిక్సులు బాదింది. మరోవైపు హర్మన్ప్రీత్ రెండు చూడచక్కని సిక్సులు కొట్టింది. అయితే సూపర్నోవాస్ బౌలర్లు పుంజుకుని ఈ ఇద్దరినీ పెవిలియన్ చేర్చారు. ఆపై క్రమంగా వికెట్లు తీసి స్కోరును కట్టడి చేశారు. వెలాసిటీ బ్యాటర్లలో శశికల (18), పూజ (0), రాధ (2), షకీరా (5)లు తక్కువ పరుగులు చేశారు. ఆఖరి రెండు బంతుల్లో సూపర్నోవాస్ రెండు వికెట్లు కోల్పోయింది. వెలాసిటీ బౌలర్ ఎక్తా బిస్త్ అద్భుతగా బౌలింగ్ చేసింది. 4 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టింది. జహానారా, లీ కాస్పెరక్ చెరో రెండు వికెట్లు తీశారు.
యూఏఈలోని షార్జాలో మహిళల టీ20 ఛాలెంజ్ టోర్నీ జరుగుతోంది. నవంబరు 4 నుంచి 9 వరకు జరగనున్న టోర్నమెంట్లో మొత్తం నాలుగు మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. ఇందులో సూపర్నోవాస్, వెలాసిటీ, ట్రైల్బ్లేజర్స్ పాల్గొంటున్నాయి. సూపర్ నోవాస్కు హర్మన్ప్రీత్ కౌర్, ట్రెయిల్ బ్లేజర్స్కు స్మృతీ మంధాన, వెలాసిటీకి మిధాలీరాజ్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ తర్వాత తొలిసారి భారత క్రీడాకారిణిలు మైదానంలోకి దిగారు. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, న్యూజిలాండ్తో క్రికెటర్లు కూడా టోర్నీలో పాల్గొంటున్నారు.