
హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్లో కూడా మహిళల టీ20 ఎగ్జిబిషన్ మ్యాచ్లు నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలను సిద్ధం చేసింది. అయితే, ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్లకను లీగ్ ప్లే ఆఫ్స్ దశలో మాత్రమే వీటిని నిర్వహించే అవకాశముందని బీసీసీఐ వెల్లడించింది.
ఈ నేపథ్యంలో బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ "గతేడాదిలాగే ప్లే ఆఫ్స్ మధ్యలోనే ఈ మ్యాచ్లను జరిపే వీలుంది. అయితే సాధారణ ఎన్నికల తేదీలు వెల్లడయ్యాక వీటిపై తుది నిర్ణయం తీసుకుంటాం. ఐపీఎల్ మ్యాచ్లు లేని సమయంలో రాత్రి 7 నుంచి ఆడిస్తే ప్రేక్షకులు ఎక్కువగా హాజరయ్యే అవకాశం ఉంటుంది" అని తెలిపారు.
ఈ మ్యాచ్లను రెండు జట్ల మధ్య బెస్ట్ ఆఫ్-3 విధానంలో లేదా మూడు జట్ల నడుమ రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్లతో పాటు ఫైనల్ జరపాలా? దానిపై బీసీసీఐ ఆలోచన చేస్తోంది. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2019 సీజన్ షెడ్యూల్ని బీసీసీఐ ఇటీవలే విడుదల చేసింది. అయితే కేవలం 17 మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ను మాత్రమే బీసీసీఐ ప్రకటించింది.
మార్చి 23న టోర్నీ ప్రారంభం కానుంధి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తొలి రెండు వారాల షెడ్యూల్ను మాత్రం బోర్డు విడుదల చేయడం విశేషం. ఈ రెండు వారాల్లో మొత్తం 17 మ్యాచ్లు జరగనున్నాయి. మార్చి 23 నుంచి ఏప్రిల్ 5 మధ్య జరిగే మ్యాచ్ల షెడ్యూల్ను ఐపీఎల్ ట్విటర్లో ఉంచారు.
మిగతా షెడ్యూల్ను లోక్సభ ఎన్నికల తర్వాత విడుదల చేసే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉంటే సన్రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్ను మార్చి 24న కోల్కతా నైట్రైడర్స్తో ఆడనుంది. నగరంలోని ఉప్పల్ స్టేడియంలో మార్చి 29న రాజస్థాన్ vs సన్రైజర్స్ మ్యాచ్తో ఈ సీజన్లో తొలి మ్యాచ్ జరగనుంది.