హైదరాబాద్: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న మహిళల టీ20 అండర్-19 టోర్నీలో విచిత్రపు సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనకు గుంటురూలోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మహిళల అకాడమీ వేదికైంది.
ఛాన్స్ దొరికితే ధోనిలాగా మారిపోతా: పాక్ మాజీ కెప్టెన్ (వీడియో)
టోర్నీలో భాగంగా మంగళవారం గుంటూరులోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మహిళల అకాడమీలో ఆంధ్ర-సిక్కిం జట్లు తలపడ్డాయి. ఆంధ్రా జట్టుతో జరిగిన మ్యాచ్లో సిక్కిం జట్టు కేవలం 8 పరుగులకే ఆలౌటైంది. సిక్కిం జట్టులో 8 మంది డకౌట్ కావడం గమనార్హం.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. అనంతరం పేసర్ సాయిలక్ష్మి (5/6), సింధుజ (3/1)ల ధాటికి సిక్కిం జట్టు తేలిపోయింది. ఈ మ్యాచ్లో సాయిలక్ష్మి ఒకే ఓవర్లో 4 వికెట్లు తీయడం విశేషం.
సిక్కిం జట్టులో ప్రీతిక (5), అర్చన (1) మాత్రమే పరుగుల ఖాతా తెరిచారు. అదనంగా మరో 2 పరుగులు వచ్చాయి. ఫలితంగా సిక్కిం జట్టు మొత్తం 8 పరుగులు చేసింది. దీంతో 199 పరుగుల తేడాతో ఆంధ్ర జట్టు రికార్డు విజయాన్ని నమోదు చేసి తర్వాతి రౌండ్కు అర్హత సాధించింది. గతేడాది ఇదే మైదానంలో అండర్-19 టోర్నీలో నాగాలాండ్ను కేరళ 2 పరుగులకే ఆలౌట్ చేసిన సంగతి తెలిసిందే.