
అక్టోబర్ 1-16 మధ్య టీ20 ఫార్మాట్లో మహిళల ఆసియా కప్ - 2022కి ఆతిథ్యం ఇవ్వడానికి బంగ్లాదేశ్ సిద్ధమైంది. ఈ టోర్నీలో మొత్తం ఏడు జట్లు పాల్గొంటాయి. పూర్తి షెడ్యూల్, ఇతర వివరాలను ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ప్రకటించాల్సి ఉంది. బంగ్లాదేశ్తో పాటు భారత్, పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్, మలేషియా, UAE ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. సెప్టెంబర్ చివరి వారంలో యూఏఈలో 2022 మహిళల టీ20 ప్రపంచకప్ క్వాలిఫైయర్ మ్యాచ్లు ముగిసిన తర్వాత ఈ టోర్నీ ప్రారంభం కానుంది. గత వారం ఐసీసీ మొట్టమొదటి మహిళల ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం మహిళల ఆసియా కప్ టోర్నీ కోసం అక్టోబర్లో మొదటి రెండు వారాలను ప్యూచర్ టూర్స్ ప్రోగ్రాంలో ఐసీసీ కేటాయించింది.
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ వుమెన్స్ కమిటీ ఛైర్పర్సన్ షఫీయుల్ ఆలం చౌదరి నాదెల్ మాట్లాడుతూ.. ఆసియాకప్ టోర్నీ నిర్వహణ తేదీలను పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా వాస్తవానికి 2020లో జరగాల్సిన ఈ ఈవెంట్ 2021కి మార్చబడింది. 2021లో కూడా ఈ ఈవెంట్ సాధ్యపడలేదు. దీంతో ఆ ఈవెంట్ను రద్దు చేయాల్సి వచ్చింది. మహిళల ఆసియాకప్ సాధారణంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది. ఇక టోర్నమెంట్ 2012 నుండి టీ20 ఫార్మాట్లో నిర్వహించబడుతోంది. సిల్హెట్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం టోర్నమెంట్కు ఆతిథ్యం ఇస్తుంది.. గ్రౌండ్ 1 మ్యాచ్ల కోసం కేటాయించగా.. గ్రౌండ్ 2 ట్రైనింగ్ పర్పస్ కోసం కేటాయించబడింది.
ఇటీవల కామన్ వెల్త్ గేమ్స్లో రజతం సాధించిన భారత్.. త్రుటిలో స్వర్ణం చేజార్చుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆసియా కప్ రూపంలో మరో మెగా ఈవెంట్ టీమిండియా వుమెన్స్ క్రికెట్కు అవకాశమొచ్చింది. కామన్ వెల్త్ గేమ్స్ ఫైనల్లో చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి.. ఈ ఈవెంట్ తప్పకుండా టీమిండియాకు మరో అద్భుత అవకాశమనే చెప్పాలి.