ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టినీ ఆకర్షించిన కేకేఆర్ ఫినిషర్ రింకూ సింగ్కు బీసీసీఐ మొండి చెయ్యి చూపింది. వెస్టిండీస్తో ఐదు టీ20ల సిరీస్ కోసం ప్రకటించిన బృందంలో అతనికి చోటు దక్కలేదు. ఇది చూసిన చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొందరు ఫ్యాన్స్ అయితే నెట్టింట తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ఈ క్రమంలో రింకూ సింగ్ కోచ్ మసూద్ ఆమిని ఈ విషయంపై స్పందించాడు.
రింకూ సింగ్కు టీ20 జట్టులో చోటు దక్కాల్సిందని, అలా జరగకపోవడం నిజంగా చాలా బాధాకరమని ఆమిని అన్నాడు. 'తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్ వంటి కుర్రాళ్లను సెలెక్ట్ చేశారు. వాళ్లతోపాటు రింకూ కూడా అక్కడ ఉండాల్సింది. అది జరగలేదు కాబట్టి బాధగానే ఉంటుంది' అని ఆమిని బాధపడ్డాడు. అయితే ఇలా అవకాశం దక్కలేదని రింకూ బాధపడడని కూడా చెప్పాడు. ఈసారి మరింత అద్భుతంగా రాణించేందుకు ప్రయత్నిస్తాడన్నాడు.

'టీమిండియాలో చోటు దక్కుతుందని తను కూడా అనుకొని ఉంటాడు. కానీ ఇప్పుడు అవకాశం దక్కలేదని అంత బాధపడతాడని నేను అనుకోను. ఏం ఫర్లేదు ఇంకా కష్టపడతా. ఇంకేం చేస్తాం?' అని తన శిష్యుడు అంటాడని ఆమిన్ వెల్లడించాడు. రింకూ ఎప్పటికీ ఓటమి ఒప్పుకోడని, మరింత కష్టపడి ఇంకా గొప్పగా రాణించేందుకు ప్రయత్నిస్తాడని చెప్పాడు. తన ఆటలో లోపాలను గుర్తించి మెరుగు పరుచుకుంటాడని తెలిపాడు.
పాతికేళ్ల రింకూ సింగ్ ఈ ఏడాది ఐపీఎల్లో పలుసార్లు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్లు ఆడాడు. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్పై చివరి ఓవర్లో అతను వరుసగా ఐదు సిక్సర్లు బాది జట్టును గెలిపించడం ఇప్పుడప్పుడే ఎవరూ మర్చిపోలేరు. ఈ సీజన్ అంతా రాణించిన అతను 59.25 సగటు, 149.52 స్ట్రైక్ రేటుతో 474 పరుగులు చేశాడు. అతని సత్తా చూసిన చాలా మంది టీ20 జట్టులో రింకూకు చోటు ఖాయమని అనుకున్నారు. కానీ అలా జరగలేదు.
భారత బృందం: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషణ్, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయి, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్, ఆవేష్ ఖాన్.