వెస్టిండీస్తో టీ20 సిరీస్కు బీసీసీఐ జట్టును ప్రకటించింది. ఈ టీంలో పంజాబ్ కింగ్స్ వికెట్ కీపర్ జితేష్ శర్మ పేరు కూడా లేదు. స్టార్ ప్లేయర్లు సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఇలా తనకు జట్టులో అవకాశం దక్కకపోవడంపై జితేష్ చాలా బాధ పడ్డాడు. రోడ్డు ప్రమాదం కారణంగా రిషభ్ పంత్ ఆటకు దూరమైన తర్వాత కొత్త వికెట్ కీపర్లకు సెలెక్టర్లు అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇలా విండీస్ టూర్లో తనకు అవకాశం దక్కకపోవడం తనను చాలా బాధించిందని చెప్పిన జితేష్.. ఆ బాధలోనే ఉండిపోలేదు. 'దేవుడు నా కోసం వేరే ఏదో ప్లాన్ చేసే ఉంటాడు' అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. మహారాష్ట్రకు చెందిన జితేష్. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడతాడనే విషయం తెలిసిందే. ఈ ఏడాది అతను అద్భుతంగా రాణించాడు. క్రీజులోకి వచ్చిన ప్రతిసారి ఇంపాక్ట్ చూపించాడు.

ఈ సీజన్లో 14 మ్యాచులు ఆడిన అతను 23.77 సగటతో 309 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేటు 156.06గా ఉండటం గమనార్హం. ఐపీఎల్కు ముందు న్యూజిల్యాండ్, శ్రీలంకతో స్వదేశంలో టీ20లు ఆడిన భారత జట్టులో జితేష్ ఉన్నాడు. అలాంటి ప్లేయర్ను సడెన్గా ఎందుకు పక్కన పెట్టారో తెలియడం రాలేదు. ఆ సమయంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని జితేష్ చెప్పాడు.
'టీం అంతా కొత్త వాడిననే భావన లేకుండా చూసుకున్నారు. ద్రావిడ్ సర్ నా ఆటతీరును మెచ్చుకున్నాడు. నా వంటి వారి కోసమే తాము చూస్తున్నట్లు చెప్పాడు. నేను కూడా భారీ స్కోర్లు చేయాలని అనుకుంటున్నట్లు చెప్తే.. పరుగులు మ్యాటర్ కాదు. ఇంపాక్ట్ ముఖ్యం. విజయంలో నువ్వు ఎంత కీలక పాత్ర పోషిస్తే.. జట్టుకు అది అంత ముఖ్యం అవుతుంది' అని ద్రావిడ్ చెప్పినట్లు జితేష్ వెల్లడించాడు.