యువరాజ్ లేకపోతే గెలిచేవాళ్ళం కాదు:
హర్భజన్ మాట్లాడుతూ... 'ప్రపంచకప్లలో యువరాజ్ది కీలక పాత్ర. ఇందులో సందేహమే లేదు. అందరూ సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, కపిల్ దేవ్ గురించి మాట్లాడతారు. యువీ లేకుంటే 2007, 2011 ప్రపంచకప్లు మనం గెలిచేవాళ్ళం కాదు. అతడు లేకుంటే మనం కేవలం సెమీసే చేరేవాళ్లం. ధన్యవాదాలు యువీ' అని అన్నాడు.
యువీ ఉండడం మా అదృష్టం:
'క్రికెట్ ఆటలో మంచి జట్లు సెమీస్ వరకు చేరతాయి. ఈ సారీ టీమిండియా సెమీస్ చేరింది. కానీ.. కప్ గెలవాలంటే మాత్రం యువీ లాంటి ఆటగాడు జట్టులో ఉండాలి. అప్పుడు జట్టులో యువీ ఉండడం మా అదృష్టం. ఎలాంటి లక్ష్యాన్నైనా ఛేదించేందుకు, వికెట్లు తీసేందుకే యువరాజ్ ఉన్నాడు. మైదానంలో రనౌట్లు చేయడం, క్యాచ్ అందుకోవడమో కూడా చేస్తాడు. అతడో మంచి ఆటగాడు. 2011 తర్వాత టీమిండియా రెండు ప్రపంచకప్లు ఆడింది. కానీ.. గెలవలేకపోయింది. యువీ లాంటి ఆటగాడిని ఇప్పుడు వెతకాల్సిన అవసరం ఉంది' అని హర్భజన్ పేర్కొన్నాడు.
అంచనాలు అసలే లేవు:
'2007 టీ20 ప్రపంచకప్ మాకు చాలా ప్రత్యేకం. జట్టులోని కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చారు. ఎవరూ ఆ టోర్నీని తీవ్రంగా తీసుకోలేదు.ఇక అంచనాలు అసలే లేవు. ప్రపంచకప్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. జట్టుకు ఎంఎస్ ధోనీ కొత్త కెప్టెన్. ఎలాంటి అంచనాలు లేకుండా మేం ప్రపంచకప్ ఆడాం. ఫైనల్ మ్యాచ్ ఎప్పటికీ మర్చిపోలేను. ధోనీ అద్భుతంగా నడిపించాడు. యువ ఆటగాళ్లు తానేంటో నిరూపించుకున్నారు' అని అదే కార్యక్రమంలో పాల్గొన్న యువీ చెప్పుకొచ్చాడు.
సరైన ఆటగాళ్లను ఎంపిక చేయలేదు:
'ప్రపంచకప్ టోర్నీకి భారత జట్టు యాజమాన్యం అవలంభించిన విధానం పూర్తిగా తప్పు అని నా అభిప్రాయం. మిడిల్ ఆర్డర్లో అనుభవం లేని ఆటగాళ్లకు అవకాశం ఇచ్చారు. టాప్ ఆర్డర్కు అనుగుణంగా మిడిలార్డర్లో సరైన ఆటగాళ్లను ఎంపిక చేయలేకపోయింది. అనుభవజ్ఞడైన అంబటి రాయుడిని పక్కన పెట్టారు. ఆల్రౌండర్ అన్న పేరుతో విజయ్ శంకర్ను జట్టులోకి తీసుకున్నారు. శంకర్ గాయపడ్డా రాయుడిని తీసుకోకుండా రిషబ్ పంత్ వైపు మొగ్గుచూపారు' అని మండిపడ్డాడు.