టీమిండియా మరో టీ20 సిరీస్ పై కన్నేసింది. సొంతగడ్డపై ఆస్ట్రేలియాను 4-1 తేడాతో చిత్తు చేసిన సూర్యకుమార్ సేన దక్షిణాఫ్రికాతో సవాల్ కు సిద్ధమైంది. ఇవాళ రాత్రి 7.30 గంటలకు డర్బన్ వేదికగా సఫారీసేనతో తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది.
అయితే తుదిజట్టు ఎంపిక విషయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ రాహుల్ ద్రవిడ్ కు కష్టాలు తప్పేలా లేవు. స్టార్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ జట్టులోకి తిరిగి రావడంతో ఓపెనర్లుగా ఎవరిని బరిలోకి దించుతారని ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైశ్వాల్ ఓపెనర్లుగా రాణించారు.

ఆస్ట్రేలియా సిరీస్ లో రుతురాజ్ నిలకడగా పరుగులు సాధించాడు. టాప్ స్కోరర్ గా నిలిచాడు. అయిదు మ్యాచ్ ల్లో సెంచరీతో సహా 223 పరుగులు చేశాడు. మరోవైపు యశస్వీ జైశ్వాల్ కూడా 170 స్ట్రైక్ రేటుతో 138 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఇప్పుడు గిల్ కోసం వారిద్దరిలో ఒకరిని పక్కన పెట్టడం సవాలే అని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
''గిల్ ను తొలి మ్యాచ్ లో ఆడిస్తారని భావిస్తున్నా. ఆసీస్ తో జరిగిన సిరీస్ లో రుతురాజ్ టాప్ స్కోరర్. సెంచరీ కూడా సాధించాడు. జైశ్వాల్ విధ్వంసకర ఎడమచేతి వాటం బ్యాటర్. వారిద్దరిలో ఒకరిని తప్పించడమంటే అత్యంత కఠిన సవాలే. గిల్ తో ఓపెనర్ ఎవరొస్తారనే ప్రశ్నకు నా దగ్గర కూడా సమాధానం లేదు. 17 మందితో ఉన్న భారత జట్టులో నుంచి తుదిజట్టును ఎంపిక చేయడం కష్టమే''అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.

వచ్చే ఏడాది జూన్ లో వెస్టిండీస్-అమెరికా వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుంది. అయితే ఈ మెగాటోర్నీ ముందు భారత్ మరో ఆరు టీ20 మ్యాచ్ లు మాత్రమే ఆడనుంది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా సిరీస్ ఎంతో కీలకం కానుంది.