కోల్కతా: భారత ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీ ఆట పట్ల తనకున్న అంకితా భావాన్ని చాటుకున్నాడు. ఓ వైపు తన చిన్న కూతురు అనారోగ్యంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నప్పటికీ.. న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్టులో ఆడాడు షమీ.
తీవ్రమైన జ్వరం, శ్వాస సమస్య కారణంగా షమీ చిన్న కూతురు ఐరా(14నెలలు) ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)లో చేరింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్లో న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజునే ఐరా ఆస్పత్రిలో చేరింది.
అక్టోబర్ 1న రెండో రోజు ఆట ముగిసిన తర్వాత షమీకి కూతురు ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసింది. అయితే, టెస్టులో మిగిలిన రెండు రోజుల టెస్ట్ మ్యాచ్లో బౌలర్లకు కీలకంగా మారింది. దీంతో, ఈ సమయంలో తాను మ్యాచ్ విడిచి వెళ్లేందుకు సిద్ధపడలేదు షమీ. అయితే, మ్యాచ్ ముగిసిన ప్రతీ రోజు రాత్రి ఆస్పత్రికి వెళ్లి తన కూతురును చూసి వచ్చేవాడు.

కాగా, రెండో టెస్టులో షమీ మొత్తం 6 వికెట్లు పడగొట్టి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొదటి ఇన్నింగ్స్లో 3, రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్లు పడగొట్టాడు. ఇతర బౌలర్లు కూడా రాణించడంతో 178 పరుగుల తేడాతో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్ 2-0తో టీమిండియా కైవసం చేసుకుంది.
మ్యాచ్ అనంతరం విజయంపై షమీ స్పందిస్తూ.. 'నేను నా కూతుర్ని ఆస్పత్రిలో చూసి వచ్చిన తర్వాత ప్రతీ రోజు రాత్రి మా కెప్టెన్ నాకు ఎంతో స్ఫూర్తినచ్చేవాడు. నా కూతురు త్వరలోనే ఆరోగ్యంగా తిరిగొస్తుందని చెప్పేవారు. అందుకే నేను కెప్టెన్కు, ఇతర ఆటగాళ్లకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా' అని తెలిపాడు.

కాగా, టీవీ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్.. షమీపై ప్రశంసలు కురిపించారు. కూతురు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ.. ఎంతో అంకితభావంతో షమీ మ్యాచులో అద్భుత ప్రదర్శన చేశాడని అన్నారు.
ఇది ఇలా ఉండగా, సోమవారం పూర్తిగా కోలుకున్న షమీ కూతురు ఆస్పత్రికి నుంచి ఇంటికి చేరుకుంది. దీంతో అందరూ ఆనందంగా టెస్ట్ విజయాన్ని పంచుకున్నారు. మరికొందరు ఆటగాళ్లు తమ సతీమణులతో కోల్కతాలో జరుగుతున్న దసరా వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.