హైదరాబాద్: పాకిస్తాన్పై శ్రీలంక టెస్టు సిరీస్ నెగ్గడానికి కారణం క్షుద్రపూజలేనని శ్రీలంక కెప్టెన్ దినేశ్ చండీమాల్ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశాడు. ఓ మంత్రగత్తె సాయం తీసుకోవడం వల్లే అక్టోబర్ నెలలో పాకిస్థాన్ మీద రెండు టెస్టుల సిరీస్లో గెలిచామని చండీమాల్ వ్యాఖ్యానించడం పెనుదుమారాన్ని రేపుతున్నాయి.
వివరాల్లోకి వెళితే...
శ్రీలంక- పాకిస్థాన్ జట్ల మధ్య యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) వేదికగా సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 29 వరకు రెండు టెస్టులు, ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ జరిగింది. టీ20 సిరిస్లో చివరిదైన మూడో టీ20ని మాత్రం లాహోర్లోని గడాఫీ స్టేడియంలో ఇరు జట్లు ఆడాయి.

టెస్ట్ సిరీస్ను శ్రీలంక 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇక వన్డే, టీ20 సిరిస్లను మాత్రం పాకిస్థాన్ క్లీవ్ స్వీప్ చేసింది. దీంతో ఈ పర్యటన ముగించుకుని శ్రీలంక జట్టు మంగళవారం స్వదేశానికి చేరుకుంది. ఈ సందర్భంగా కెప్టెన్ చండీమాల్ మీడియాతో జరిపిన చిట్ చాట్లో సంచలన విషయాలు వెల్లడించాడు.
మంత్రగత్తె ఆశీర్వాదంతో
'నేను ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా ఆశీస్సులు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాం. మనకు టాలెంట్ ఒక్కటే సరిపోదు. కాస్త అదృష్టం కూడా కలిసిరావాలని నేను నమ్ముతాను. ఆ అదృష్టం మనకు ఎప్పుడు, ఎక్కడ, ఎలా దొరుకుతుందో చెప్పలేం. అందుకే మతగురువులు, మంత్రగాళ్లు అనే తేడా లేకుండా అందరి దగ్గరా నేను ఆశీర్వాదాలు తీసుకుంటాను. పాక్తో సిరీస్ ఆడటానికి వెళ్లేముందు మంత్రగత్తె అయిన తన స్నేహితుడి తల్లిని తాను కలిశా. శ్రీలంక చేతిలో పాకిస్థాన్ ఓడిపోయేలా చేతబడి చేస్తానని ఆమె మాటిచ్చారు. ఆ తల్లి ఆశీర్వాదబలం, పూజల వల్లే మేం సిరీస్ గెలిచాం' అని చండిమాల్ అన్నాడు.
సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు
చండీమాల్ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. క్రికెట్కు మంత్రాలతో ఎలా ముడిపెడతారని అతడిని నెటిజన్లు నిలదీశారు. 'ఒకవేళ మంత్రాలతో మ్యాచ్లు గెలవగలిగితే.. టెస్ట్ సిరీస్ నెగ్గిన శ్రీలంక జట్టు, ఆ తర్వాత జరిగిన వన్డే, టీ20 మ్యాచ్ల్లో దారుణంగా ఎందుకు ఓడిపోయింది?' అని చండిమాల్ను ప్రశ్నించారు.