
హైదరాబాద్: అండర్-19 ప్రపంచకప్లో భారత్ దూసుకుపోతోంది. భారత యువ ఆటగాళ్లు ప్రత్యర్థులను చిత్తు చేస్తూ చెలరేగిపోతున్నారు. కాగా, తొలి మ్యాచ్లోనే ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్లో భారత్ భారీ స్కోరుకు ఓపెనర్లు పృథ్వీ షా(94), మన్జ్యోత్ కల్రా(86)లతో పాటుగా మూడో నంబర్ బ్యాట్స్మన్ శుభమ్ గిల్ (63) బాటలు వేశారు. ఇప్పుడు వీరితోపాటు కమలేశ్ నాగర్కోటి చేరాడు. ఎందుకంటే, చురకత్తుల్లాంటి బంతులు సంధించి ఆసీస్ బ్యాట్స్మెన్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు.
ఈ యువ పేసర్ రాజస్థాన్కు చెందిన క్రికెటర్. ప్రపంచకప్ తొలి మ్యాచ్లో గంటకు 140 కి.మీకుపైగా వేగంతో బంతులను సంధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతను వేసిన తొలి ఓవర్ ఐదో బంతి వేగం 146 కి.మీ. గత ప్రపంచకప్లో విండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్ 147 కేఎంపీహెచ్తో బంతులను సంధించి వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు ఆ రికార్డును నాగర్కోటి అధిగమించడానికి ఎంతో సమయం పట్టదని క్రికెట్ నిపుణులు అంటున్నారు.
ఆసీస్తో జరిగిన మ్యాచ్లో కమలేశ్తోపాటు శివమ్ మావి, మూడో పేసర్ అయిన ఇషాంత్ పోరెల్ కూడా 135 కి.మీ కంటే ఎక్కువ వేగంతో బంతులను విసిరి మ్యాచ్ దిశను మార్చారు. ఈ మ్యాచ్లో ఆసీస్పై భారత్ వంద పరుగుల తేడాతో విజయం సాధించింది. నాగర్కోటి, శివమ్ మావి తలో మూడు వికెట్లు తీయగలిగారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.