టీమిండియా విజయోత్సవ ర్యాలీ అద్వితీయంగా ముగిసింది. వేలాది అభిమానుల మధ్య, పూల వర్షంలో భారత ఆటగాళ్లు వాంఖడే స్టేడియానికి వైభవంగా తరలివెళ్లారు. 13 ఏళ్ల ప్రపంచకప్ నిరీక్షణకు తెరదించిన రోహిత్ సేనకు అభిమానులు అడుగడుగునా నీరాజనం పలికారు. విశ్వవిజేతలకు స్వాగతం పలకాలని అభిమానులు భారీగా తరలిరావడంతో మెరైన్డ్రైవ్ జనసంద్రాన్ని తలపించింది.
వాంఖడే స్టేడియంలో టీమిండియాకు బీసీసీఐ సన్మాన కార్యక్రమం నిర్వహించింది. భారత ఆటగాళ్లను, కోచింగ్ స్టాఫ్ను బీసీసీఐ సత్కరించింది. అంతేగాక రూ.125 కోట్ల ప్రైజ్మనీ చెక్ అందజేసింది. ఆ తర్వాత స్టేడియం చుట్టూ భారత ఆటగాళ్లు ప్రపంచకప్ను ప్రదర్శిస్తూ అభిమానులకు అభివాదం చేస్తారు. ఈ కార్యక్రమంతో విక్టరీ పరేడ్ ముగిసింది.

కాగా, 2007 విజయోత్సవ ర్యాలీ కంటే 2024 విక్టరీ పరేడ్ తనకెంతో స్పెషల్ అని రోహిత్ శర్మ చెప్పాడు. దేశానికి టీ20 వరల్డ్ కప్ అందించిన రెండో కెప్టెన్గా రోహిత్ శర్మ చరిత్రకెక్కిన విషయం తెలిసిందే. 2007లో ఎంఎస్ ధోనీ సారథ్యంలోని భారత జట్టు తొలిసారి పొట్టి కప్ను అందుకుంది. అయితే అప్పటి జట్టులో రోహిత్ సభ్యుడు. బ్యాటర్గా జట్టు విజయాల్లో తన వంతు కీలక పాత్ర పోషించాడు. ఈ సారి సారథిగా మరోసారి ఛాంపియన్ టీమ్లో నిలిచాడు.
అయితే 2007 టీ20 ప్రపంచకప్ కంటే 2024 ప్రపంచకప్ విజయమే తనకెంతో స్పెషల్ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ''2007 భిన్నమైన ఫీలింగ్. 2007 విజయాన్ని ఎప్పటికీ మరవలేను. అది నా తొలి ప్రపంచకప్. అయితే 2024 వరల్డ్ కప్ మాత్రం నాకెంతో స్పెషల్. ఎందుకంటే నేను జట్టును నడిపించాను. ఇది నా పరంగా గొప్ప విషయం. ఇది ఎంతో ఉత్సాహాన్ని తీసుకువస్తుంది. దేశం మొత్తానికి ఆ అనుభూతిని కలిగిస్తుంది. ఇలాంటి ఘనతను మేం సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉంది'' అని రోహిత్ శర్మ తెలిపాడు.