సెంచరీ సాధించడం కన్నా సిరిస్ గెలవడమే ముఖ్యం: రోహిత్ శర్మ

హైదరాబాద్: సెంచరీ సాధించడం కన్నా సిరిస్ గెలవడమే తనకు ఎంతో ముఖ్యమని టీమిండియా బ్యాట్స్మన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. బ్రిస్టల్ వేదికగా జరిగిన ఆఖరి టీ20లో ఆతిథ్య ఇంగ్లాండ్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించి మూడు టీ20ల సిరిస్ను 2-1తేడాతో కోహ్లీసేన సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో నాటౌట్గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం దినేశ్ కార్తీక్తో కలిసి బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్యూలో రోహిత్ శర్మ మాట్లాడుతూ "సిరిస్ నెగ్గినందుకు చాలా సంతోషంగా ఉంది. రెండో గేమ్లో ఓడిపోవడంతో మూడో టీ20 కీలకంగా మారింది" అన్నాడు.
"ఈ మ్యాచ్లో సమిష్టిగా రాణించి విజయం ఎలా సాధించాలని మాత్రమే మైండ్లో ఉంది. మెరుగైన ప్రదర్శన చేస్తే వ్యక్తిగత రికార్డులు అనేవి వాటంతట అవే వస్తాయి. వ్యక్తిగత రికార్డుల గురించి పెద్దగా ఆలోచించలేదు. ఆరంభంలో చక్కటి భాగస్వామ్యాలను నెలకొల్పి... విజయం దిశగా జట్టుని నడిపించాలి" అని రోహిత్ శర్మ వెల్లడించాడు.

9 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసిన ఇంగ్లాండ్
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. ఒకానొక దశలో ఇంగ్లాండ్ 230 పరుగులు చేసేలా కనిపించింది. అయితే చివర్లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేయడంతో డెత్ ఓవర్లలో ఇంగ్లాండ్ జోరు తగ్గింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా దూకుడుగా ఆడింది. ఈ క్రమంలో కోహ్లీతో కలిసి రోహిత్ శర్మ (56 బంతుల్లో 100 నాటౌట్)గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సెంచరీతో రోహిత్ శర్మ టీ20ల్లో అనేక వ్యక్తిగత రికార్డులను నెలకొల్పాడు.

టీ20ల్లో 2,000 పరుగులు పూర్తి చేసిన రోహిత్ శర్మ
ఈ మ్యాచ్లో 56 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సులతో సెంచరీ సాధించిన రోహిత్ శర్మ టీ20ల్లో 2,000 పరుగులు పూర్తి చేసిన రెండో భారత క్రికెటర్గా నిలిచాడు. ఈ మ్యాచ్కి ముందు వరకు 1,986 పరుగులతో ఉన్న రోహిత్ శర్మ.. ఈ సెంచరీతో 2,086 పరుగులతో నిలిచాడు. భారత్ తరఫున రోహిత్ శర్మ కంటే ముందు విరాట్ కోహ్లీ మాత్రమే 2,102 పరుగులను పూర్తి చేశాడు. ఈ ఫార్మాట్లో ఇప్పటి వరకు రోహిత్ శర్మతో కలిపి మొత్తం ఐదుగురు క్రికెటర్లు మాత్రమే రెండువేల పరుగుల మైలురాయిని అందుకున్నారు.

టీ20ల్లో రోహిత్ శర్మకు ఇది మూడో సెంచరీ
ఈ జాబితాలో న్యూజిలాండ్ హిట్టర్లు మార్టిన్ గప్తిల్ (2,271), బ్రెండన్ మెక్కలమ్ (2,140) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా.. పాకిస్థాన్ మిడిలార్డర్ బ్యాట్స్మెన్ షోయబ్ మాలిక్ (2,121) మూడో స్థానంలో.. తర్వాత విరాట్ కోహ్లి (2,102), రోహిత్ శర్మ (2,086) కొనసాగుతున్నారు. టీ20ల్లో రోహిత్ శర్మకు ఇది మూడో సెంచరీ. దీంతో టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ.. న్యూజిలాండ్ ఆటగాడు కొలిన్ మన్రో సరసన చేరాడు. దీంతో పాటు అత్యధికంగా 90కిపైగా పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ కూడా.. వెస్టిండిస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ సరసన నిలిచాడు.

వన్డేల్లో మూడు ట్రిపుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్మన్
ఇప్పటికే, వన్డేల్లో రోహిత్ శర్మ మూడు ట్రిపుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్మెన్గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 84 టీ20 మ్యాచ్లు ఆడిన రోహిత్.. 77 ఇన్నింగుల్లో 2086 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20ల్లో రోహిత్ శర్మ అత్యధిక స్కోరు 118. 2015లో ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో రోహిత్ తొలి సెంచరీ సాధించాడు. అనంతరం 2017లో ఇండోర్లో శ్రీలంకపై రెండో సెంచరీ సాధించాడు. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా బ్రిస్టల్లో జరిగిన మూడో టీ20లో మూడో సెంచరీ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications