Asia Cup 2025: ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు ఎంపికపై మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత జట్టుతో ఆసియా కప్ గెలవచ్చేమో గానీ.. ప్రపంచ కప్ గెలవడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ జట్టు ప్రపంచ కప్ గెలవలేదు..
తన యూట్యూబ్ ఛానెల్లో కృష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడుతూ.. "ఈ జట్టుతో మనం ఆసియా కప్ టైటిల్ గెలవగలం, కానీ ఈ జట్టుతో ప్రపంచ కప్ గెలవగలమని నేను అనుకోవడం లేదు. ప్రపంచ కప్కు ఇంకా ఆరు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ జట్టుతో మనం ప్రపంచ కప్కు వెళ్లాలనుకుంటున్నామా? ఇవేనా మన ప్రపంచ కప్ సన్నాహాలు?" అని ఆయన ప్రశ్నించారు.

అలాగే రింకూ సింగ్, శివం దూబే, హర్షిత్ రాణా వంటి ఆటగాళ్లు ఎలా జట్టులోకి వచ్చారో తనకు అర్థం కావడం లేదని శ్రీకాంత్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అక్షర్ పటేల్ను వైస్ కెప్టెన్సే నుంచి ఎందుకు తప్పించారో కూడా తనకు తెలియదని అన్నారు. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా జట్టును సెలెక్ట్ చేస్తారని అనుకున్నానని.. కానీ సెలెక్టర్లు అంతకు ముందు ఆటగాళ్ల ప్రదర్శనను పరిగణనలోకి తీసుకున్నారేమోనని ఆయన పేర్కొన్నారు.
యశస్వి జైస్వాల్ను ఎందుకు ఎంపిక చేయలేదు?
యశస్వి జైస్వాల్ విషయంలో కూడా శ్రీకాంత్ సెలెక్టర్ల నిర్ణయాన్ని విమర్శించారు. "యశస్వి జైస్వాల్ అంతర్జాతీయ క్రికెట్తో పాటు ఐపీఎల్లో కూడా అద్భుతంగా ఆడాడు, అయినప్పటికీ అతన్ని జట్టులోకి తీసుకోలేదు. అసలు అతను ఏం చేశాడు?" అని ప్రశ్నించారు. శివం దూబేను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారో కూడా తనకు అర్థం కావడం లేదని ఆయన అన్నారు.
ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు ఇదే:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, జితేష్ శర్మ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శివం దూబే, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా.