
హైదరాబాద్: కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్దూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సవం రోజున స్నేహపూర్వకంగా జరిగిన కార్యక్రమంలో పాక్ చీఫ్ తనను పలకరించగా.. ఆయన్ను ఆలింగనం చేసుకున్నానని చెప్పారు.
ఒకవేళ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వచ్చి భారత క్రికెటర్ విరాట్ కోహ్లీని హగ్ చేసుకోవాలని భావిస్తే.. కోహ్లీ తన వెన్నుని చూపించగలడా? అని ప్రశ్నించారు. సరిగ్గా పాక్లో తనకు ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయని సిద్ధూ తెలిపాడు. అంతేకాదు పాక్ ఆర్మీ చీఫ్ను ఆలింగనం చేసుకోవడాన్ని సైతం సిద్ధూ సమర్థించుకున్నారు.
సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ 550వ జయంతి సందర్భంగా పాకిస్థాన్లో ఉన్న కర్తార్పూర్లోని గురుద్వారా దర్బార్ సాహిబ్ కారిడార్ను తెరవడానికి సిద్ధంగా ఉన్నట్లు పాక్ వెల్లడించింది. ఆ సమయంలో పాక్ ఆర్మీ చీఫ్తో తాను ఆప్యాయంగా మాట్లాడానని, అందులో భాగంగానే స్నేహపూర్వకంగా ఆలింగనం చేసుకున్నట్లు సిద్ధూ తెలిపారు.
తాను కేవలం ఆలింగనం మాత్రమే చేసుకున్నానని, రాఫెల్ ఒప్పందాలేం కుదుర్చుకోలేదంటూ సుష్మా స్వరాజ్కు చురకలు అంటించారు. ఆసియా కప్ టోర్నీలో భాగంగా మంగళవారం భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్పై కూడా సిద్ధూ స్పందించారు.
"ఆసియా కప్లో భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే మీరు మా ప్రత్యర్థి దేశం ఆటగాళ్లు అంటూ భారత క్రికెటర్లు పాకిస్థాన్ ఆటగాళ్ల ముఖాలు చూడలేం అని" వెన్ను చూపటం సాధ్యమా? అని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి సిద్ధూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆగస్టులో పాక్ నూతన ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి సిద్ధూ హజరైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో సిద్దూ, పాక్ ఆర్మీ చీఫ్ను ఆలింగనం చేసుకోవడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పుపట్టింది. రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దీనిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇలా అయితే భారత సైనికులు పోరాటానికి ప్రయోజనం ఉండదని, వారు తమ ఇళ్లకు వెళ్లిపోవడమే ఉత్తమమని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై సిద్దూ తనదైన శైలిలో స్పందించారు.