ఉప్పల్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ ఫేవ్రేటుగా నిలిచింది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ను 246 పరుగులకే కట్టడిచేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన టీమిండియా భారీ ఆధిక్యంగా దిశగా దూసుకెళ్తోంది. అయితే భారత బ్యాటర్లు మాత్రం విమర్శలు ఎదుర్కొంటున్నారు. మంచి స్కోరును సాధించినా విమర్శలు ఎందుకు అని అనుకుంటున్నారా?
టీమిండియా టాప్-5 బ్యాటర్లు తొలి ఇన్నింగ్స్లో పరుగులు బాగానే సాధించారు. కేఎల్ రాహుల్ (86; 123 బంతుల్లో), యశస్వీ జైశ్వాల్ (80; 74 బంతుల్లో) సత్తాచాటారు. శ్రేయస్ అయ్యర్ (35; 63 బంతుల్లో), రోహిత్ శర్మ (24; 27 బంతుల్లో), శుభ్మన్ గిల్ (23; 66 బంతుల్లో) ఫర్వాలేదనిపించారు. కానీ వారు ఔటైనా తీరు తీసికట్టుగా ఉంది. ఇంగ్లాండ్ బౌలర్ల నైపుణ్యం, అద్భుతమైన బంతులతో మన బ్యాటర్లు పెవిలియన్కు చేరలేదు. బౌండరీ, సిక్సర్ సాధించాలనే అత్యుత్సాహంతో వికెట్లను సమర్పించుకున్నారు.

భారత్ తొలి అయిదుగురు బ్యాటర్లు ఇదే రీతిలో వికెట్లను కోల్పోవడం గమనార్హం. ఇంగ్లాండ్కు ఎటాకింగ్ గేమ్ ఎలా ఉంటుందో రుచిచూపించాలనే ప్రయత్నంలో వికెట్లు పారేసుకున్నారన్నట్లుగా ఔటయ్యారు. రోహిత్, శ్రేయస్, రాహుల్ సిక్సర్ కోసం భారీ షాట్కు యత్నించి ఔటవ్వగా.. గిల్, జైశ్వాల్ బౌండరీ కోసం ట్రై చేసి పెవిలియన్ బాట పట్టారు. కుదురుకున్న బ్యాటర్లు ఇలా సులువుగా వికెట్లను చేజార్చుకోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అతివిశ్వాసంతో బ్యాటింగ్ చేస్తున్నారా లేదా దూకుడుగా ఆడాలని చెత్త షాట్లు ఆడుతున్నారా అని మండిపడుతున్నారు.
అయితే తొలి టెస్టు ప్రారంభంకాక ముందు టీమిండియా ఆటగాళ్లు ఇంగ్లాండ్ బజ్బాల్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిసారీ దూకుడుగా ఆడాలనే భావిస్తే అది టీమిండియాకే మంచిదని, ఇంగ్లిష్ జట్టు తొందరగా ఆలౌట్ అవుతుందని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు అదే తరహాలో భారత బ్యాటర్లు ప్రదర్శన చేయడం గమనార్హం. మంచి బంతుల్ని గౌరవించకుండా అతిదూకుడుగా బ్యాటింగ్ చేయాలన్న నిర్ణయమే టీమిండియా కొంపముంచుతుందని క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. అందుకే రాహుల్, జైశ్వాల్ సెంచరీలు కోల్పోయారని అంటున్నారు.