హైదరాబాద్: మొహాలీ వేదికగా జరిగిన వన్డేలో 141 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన శ్రీలంక పరిస్థితి అదోగతిలా తయారైంది. అయితే, ఈ మ్యాచ్తో భారత్ జట్టు ఆటగాళ్లకే కాదు. పూర్తి జట్టుకు సైతం రికార్టులు వర్షం కురుస్తుంది. ఒక పక్క వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియాకు ధర్మశాలలో జరిగిన వన్డే ఓ బ్రేక్ లా అనిపించినా మళ్లీ అదే స్థాయిలో నిలదొక్కుకుంది. దీంతో భారత్ జట్టు రికార్డులను తన ఖాతాలో వేసుకోవడమే కాదు. పాత రికార్డులను తుడిచిపెట్టేందుకు బయల్దేరనుంది.
ఈ ఏడాది భారత్ జట్టు వన్డేల్లో నమోదు చేసిన సెంచరీల సంఖ్య 18. శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్లో భాగంగా రెండో వన్డేలో రోహిత్ డబుల్ సెంచరీ సాధించడం ద్వారా దక్షిణాఫ్రికా సరసన భారత్ నిలిచింది. ఆదివారం విశాఖలో జరిగే మూడో వన్డేలో భారత జట్టు ఒక్క సెంచరీ సాధిస్తే, ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సెంచరీలు చేసిన జట్టుగా నిలుస్తుంది.
వన్డే క్రికెట్ చరిత్రను తిరగరాశే రికార్డు ఇది. ఇప్పటివరకూ వన్డే క్రికెట్ చరిత్రలో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సెంచరీలు సాధించిన జట్లలో దక్షిణాఫ్రికా-టీమిండియాలు అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే వన్డే క్రికెట్ చరిత్రలో ఇప్పటికీ రెండు సార్లు 18 సెంచరీల స్థాయిని చేరిన జట్టు టీమిండియానే కావడం విశేషం. 1998లో టీమిండియా తొలిసారి 18 వన్డే సెంచరీలు నమోదు చేసింది. 2015లో సఫారీలు 18 వన్డే సెంచరీలు సాధించగా, 2017లో టీమిండియా ఆ రికార్డును మళ్లీ చేరుకుంది.
2017 సెంచరీలు:
ఈ ఏడాది భారత్ జట్టు వన్డేల్లో సాధించిన సెంచరీల్లో కెప్టెన్ విరాట్ కోహ్లి ఆరు సెంచరీలు చేయగా, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కూడా ఆరు సెంచరీలు సాధించాడు. ఇక మరో ఓపెనర్ శిఖర్ ధావన్ రెండు సెంచరీలు చేయగా, అజింక్యా రహానే, కేదర్ జాదవ్, యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనిలు తలో ఒక సెంచరీలు చేశారు. లంకేయులతో జరిగే చివరిదైన మూడో వన్డేలో భారత్ జట్టు సెంచరీ నమోదు చేస్తే వన్డే క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని తెరలేపింది.
1998 సెంచరీలు:
19 ఏళ్ల క్రితం భారత్ జట్టు తొలిసారి 18 వన్డే సెంచరీలు ఖాతాలో వేసుకుంది. ఆ ఏడాది సచిన్ టెండూల్కర్ విశేషంగా రాణించి తొమ్మిది సెంచరీలు నమోదు చేశాడు. ఫలితంగా ఆ క్యాలెండర్ ఇయర్లో 18 సెంచరీలను భారత్ నమోదు చేసి కొత్త రికార్డు నెలకొల్పింది. కాగా, రెండేళ్ల క్రితం దక్షిణాఫ్రికా ఆ రికార్డును సమం చేసింది. ఇప్పుడు మళ్లీ భారత జట్టు దాదాపు రెండు దశాబ్దాల తరువాత ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక వన్డే సెంచరీలను మరొకసారి సాధించింది. మరొకవైపు వన్డే చరిత్రలో ఒక క్యాలెండర్ ఇయర్లో పది, అంతకుపైగా సెంచరీలను నమోదు చేయడం భారత్ జట్టుకు ఇది పదోసారి.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.