హైదరాబాద్: శ్రీలంకతో జరిగిన ఐదు వన్డేల సిరిస్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆతిథ్య శ్రీలంకతో ఆఖరి వన్డేలో కోహ్లీ 116 బంతుల్లో 110 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
అంతేకాదు ఈ సిరిస్లో వరుసగా కోహ్లీ రెండు సెంచరీలను నమోదు చేశాడు. తద్వారా వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(30)తో కలిసి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ (49) సెంచరీలతో అందరి కంటే ముందున్నాడు.
ఈ క్రమంలో కోహ్లీ ముందున్న ఏకైక లక్ష్యం క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ వన్డేల్లో నెలకొల్పిన 49 సెంచరీల రికార్డుని అందుకోవడమే. సచిన్ రికార్డుని అందుకోవడంపై ఐదో వన్డే అనంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. సచిన్ నెలకొల్పిన అత్యధిక సెంచరీల(49) రికార్డును అధిగమించడం అత్యంత కష్టమైన పని అని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.

'గ్రేట్ మ్యాన్ (సచిన్) రికార్డు అయ్యే పని కాదు. దాని కోసం శక్తికి మించి శ్రమించాలి. అందుకే దానిపై ఆలోచించడం లేదు. టీమ్ గెలిచేందుకు నేను అజేయంగా 90 పరుగులు చేసినా అదే అమూల్యమైందిగా భావిస్తాను' అని అన్నాడు. దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ నెలకొల్పిన రికార్డుని సమం చేయడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని కోహ్లీ చెప్పాడు.
అతడో గొప్ప ఆటగాడని, గొప్ప బ్యాట్స్మెన్ అని గతంలో వారి నెలకొల్పిన రికార్డులపై గౌరవం ఉందని కోహ్లీ వెల్లడించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 30 సెంచరీలు చేసిన ఆటగాళ్లలో కోహ్లీ పిన్నవయస్కుడిగా నిలవడం విశేషం. తానెప్పుడూ రికార్డుల కోసం ఆడనని, జట్టు గెలుపు కోసం ప్రయత్నిస్తానని కోహ్లీ చెప్పడం విశేషం.
కాగా, సోమవారం ప్రకటించిన ఐసీసీ ర్యాంకింగ్స్లో కోహ్లీ అత్యధిక రేటింగ్ పాయింట్లను సాధించిన రెండో భారత క్రికెటర్గా నిలిచాడు. శ్రీలంకతో జరిగిన వన్డే సిరిస్లో వరుసగా రెండు సెంచరీలు సాధించడంతో 887 పాయింట్లతో కోహ్లీ అగ్రస్ధానంలో నిలిచాడు.
తద్వారా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అత్యధిక రేటింగ్ పాయింట్ల రికార్డును సమం చేశాడు. అంతకుముందు సచిన్ టెండూల్కర్ ఒక్కడే భారత్ తరుపున 887 రేటింగ్ పాయింట్లను సాధించాడు. 1998లో సచిన్ టెండూల్కర్ ఈ అరుదైన ఘనత సాధించారు.