Champions Trophy 2025: భారత క్రికెట్లోని ప్రతి తరంలోనూ ఎల్లప్పుడూ స్టార్ ఆటగాళ్లు ఉద్భవిస్తూనే ఉంటారు. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలను వారి వారి తరాలలో బెస్ట్ క్రికెటర్లుగా పరిగణిస్తారు. పంజాబ్ కు చెందిన 25 ఏళ్ల శుభ్మన్ గిల్ ఇప్పుడు ఆ జాబితాలోకి చేరాడు. సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ జట్టులో ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ ముఖ్యమైన ఆటగాడిగా మారినట్లే..శుభ్ మన్ గిల్ ఇప్పుడు భారత క్రికెట్ జట్టుకు యువరాజు అయ్యాడు.
కాబోయే కెప్టెన్..
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమ క్రికెట్ కెరీర్ లో చివరి అధ్యాయానికి చేరుకున్నందున.. గిల్ తదుపరి కెప్టెన్ గా ఎదిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ సిరీస్ లో భారత్ జట్టుకు శుభ్ మన్ గిల్ వైఎస్ కెప్టెన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. 2018 అండర్ -19 క్రికెట్ ప్రపంచ కప్ లో శుభ్ మన్ గిల్ భారత జట్టుకు వైఎస్ కెప్టెన్ గా రాణించాడు. ఈ సిరీస్ లో శుభ్మన్ గిల్ 372 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. ముఖ్యంగా పాకిస్థాన్ తో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్ లో గిల్ సెంచరీ సాధించాడు.

కోహ్లీ మెచ్చిన క్రికెటర్..
అదేవిధంగా తమిళనాడుతో జరిగిన తన మొదటి సీజన్ లో రంజీ క్రికెట్ లో 268 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఈ తరుణంలోనే విరాట్ కోహ్లీ గిల్ ను వెంటనే భారత క్రికెట్ జట్టులోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో శుభ్మన్ గిల్ న్యూజిలాండ్ తో జరిగిన వన్డేలో అరంగేట్రం చేశాడు. మరుసటి సంవత్సరం ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ లో తానెంటో నిరూపించుకున్నాడు. గబ్బా టెస్ట్ మ్యాచ్ లో గిల్ 146 బంతుల్లో 91 పరుగులు చేశాడు.
వన్డే క్రికెట్ లో పేరు సాధించిన గిల్..
శుభ్మన్ గిల్ 2022లో వన్డే క్రికెట్ లో తనకంటూ ఓ గొప్ప పేరును సాధించుకున్నాడు. వెస్టిండీస్ తో జరిగిన మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో శుభ్ మన్ గిల్ మొత్తం 203 పరుగులు చేసాడు. దీంతో శుభ్ మన్ గిల్ కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది. గిల్ జింబాబ్వేపై తన తొలి వన్డే సెంచరీని కూడా సాధించాడు. ఆ సిరీస్ లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా లభించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ లో గిల్ మొత్తం 80 పరుగులు చేశాడు.
అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా..
ఆ తర్వాత 2023లో గిల్ తన విస్పోటక బ్యాటింగ్ ప్రదర్శనతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో గిల్ మొత్తం 207 పరుగులు చేశాడు. ఆ సిరీస్ లో విరాట్ కోహ్లీ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. జనవరి 18, 2023న న్యూజిలాండ్ తో జరిగిన వన్డేలో గిల్ డబుల్ సెంచరీ సాధించి మొత్తం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో డబుల్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా శుభ్ మన్ గిల్ నిలిచాడు. దీని తర్వాత అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో 63 బంతుల్లో 126 పరుగు చేశాడు. దీనితో గిల్ 2023 ఆసియా కప్ కోసం టీమిండియాలో చోటును సంపాదించాడు. బంగ్లాదేశ్పై ఐదో సెంచరీ పూర్తి చేసిన గిల్.. ఆసియా కప్ సిరీస్ లో మొత్తం 302 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు.
బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానం
ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న శుభ్మన్ గిల్ 38 ఇన్సింగ్స్ లలో 2000 పరుగులు చేయడం ద్వారా.. వన్డే క్రికెట్ లో అత్యంత వేగంగా 2వేల పరుగులు సాధించిన హషీమ్ ఆమ్లా రికార్డును బద్ధలు కొట్టాడు. 2023 వన్డే ప్రపంచ కప్ లో 9 మ్యాచ్ లలో 354 పరుగులు చేశాడు 2024 టీ-20 ప్రపంచకప్ లో గిల్ రిజర్వ్ ఆటగాడిగా మాత్రమే చేర్చబడ్డాడు. ఆ తర్వాత జింబాబ్వే సిరీస్ లో కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించి సిరీస్ ను గెలుచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా గిల్ కు వైస్ కెప్టెన్సీ లభించింది. ఈ సిరీస్ లో గిల్ సెంచరీ సాధించిన తర్వాత అంతర్జాతీయ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి ఎదిగాడు.
పరుగుల వరద పారించిన గిల్
శుభ్ మన్ గిల్ ఇప్పటివరకు వన్డే ఇంటర్నేషనల్స్ ఆడి 2734 పరుగులు చేసాడు. ఇందులో 8 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గిల్ టెస్ట్ క్రికెట్ లో 32 మ్యాచ్ లు ఆడి.. 5 శతకాలు, 7 అర్థ శతకాలు బాదాడు. టీ-20 క్రికెట్ లో 21 మ్యాచ్ లు ఆడి ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. విరాట్ కోహ్లీలాగే శుభ్ మన్ గిల్ అద్బుతంగా ఆడుతున్నాడు కాబట్టి అభిమానులు అతడిని టీమిండియా ప్రిన్స్ అని పిలుస్తున్నారు. రాబోయే కాలంలో గిల్ కూడా ఎన్నో రికార్డులను సృష్టించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.
Shubman Gill reach 817 point’s in latest ODIS Ranking..🔥
— Dhillon (@Davinder_777) February 26, 2025
He is here to stay for long time now 😎🌟#ShubmanGill#ChampionsTrophy pic.twitter.com/97LOWSiGAu