హైదరాబాద్: 2019 వరల్డ్ కప్లో ఎవరు ఆడతారో ముందే ఊహించలేమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ఎవరి ఊహకందని విధంగానే జట్టు తయారవుతుందని సోమవారం మీడియాతో మాట్లాడిన కోహ్లీ చెప్పుకొచ్చాడు.
20 నుంచి 25 మంది ప్లేయర్స్తో ఓ కోర్ గ్రూప్ ఉంటుందని, వీళ్లే వరల్డ్కప్లో ఆడతారని కోహ్లీ చెప్పాడు. 'ఈ టీమ్ ఎలా ఉంటుందంటే.. ఏ బ్యాట్స్మెన్ ఏ స్థానంలో ఆడటానికైనా సిద్ధంగా ఉంటాడు. బౌలర్ కూడా బ్యాటింగ్ చేయగలుగుతాడు. ఎలాంటి సవాల్ అయినా స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు' అని కోహ్లీ చెప్పాడు.

శ్రీలంకతో జరిగిన సిరిస్లో యువ బౌలర్లు అంచనాలకు మించి రాణించడంతో, ఈ సిరిస్కు సీనియర్ బౌలర్లకు విశ్రాంతి కల్పించిన నేపథ్యంలో జట్టు కూర్పు ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే అందరికీ సమాన అవకాశాలను కల్పిస్తామని కోహ్లీ స్పష్టం చేశాడు.
ముఖ్యంగా తుది జట్టులో చోటు దక్కించుకోవడం స్పిన్నర్లకు అసలైన సవాల్ అని కోహ్లీ అన్నాడు. అశ్విన్, జడేజాలతోపాటు శ్రీలంకలో రాణించిన చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్లతో స్పిన్ విభాగంలో పోటీ ఎక్కువే ఉందని కోహ్లీ పేర్కొన్నాడు.
ఇలాంటి పోటీలో జట్టులో ఎవరు ఉంటారనేది ఊహించడం అసాధ్యమని, బౌలింగ్లో ఓ ఎక్స్ ఫ్యాక్టర్ తనకు కావాలని విరాట్ కోహ్లీ చెప్పాడు. తనతోపాటు జట్టు మేనేజ్మెంట్ ఏం చెప్పినా అనుకూలంగా తీసుకునే జట్టు తన వద్ద ఉందని, దీంతో తన పని మరింత సులువు అవుతుందని కోహ్లీ అన్నాడు.
త్వరలో జరిగే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్లలో ఎవరెలా రాణిస్తారో చూస్తామని, టీమ్కు సరైన బ్యాలెన్స్ తీసుకురావడానికి ఈ రెండు సిరీస్లు తమకు చాలా ముఖ్యమని విరాట్ కోహ్లీ చెప్పాడు. టీమ్ అంతా అద్భుతంగా ఉండేలా తీర్చిదిద్దుతామని కోహ్లీ అన్నాడు.
ఎవరు ఎక్కడైనా బ్యాటింగ్ చేసేలా, బౌలర్లూ సైతం అద్భుత ప్రదర్శన చేసేలా, అత్యుత్తమ ఫీల్డర్లు ఉండేలా జట్టుని తయారు చేస్తామని విరాట్ కోహ్లీ తెలిపాడు. జట్టు ఎవరూ ముందుగానే ఊహించే పరిస్థితి లేకపోవడం వరల్డ్కప్లో తమకు మేలు చేస్తుందని కోహ్లీ తెలిపాడు.