రోహిత్ శర్మ విషయమై భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ బుధవారం రాత్రి ఓ అప్డేట్ ఇచ్చారు. ఇంగ్లాండ్తో జరగబోయే ఐదవ టెస్ట్ నుండి రోహిత్ శర్మను ఇప్పటికీ తొలగించలేదని చెప్పాడు. జులై 1న బర్మింగ్హామ్లో ప్రారంభమయ్యే రీషెడ్యూల్ మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్తో తలపడనుంది. ఇక 5 టెస్టుల సిరీస్లో ప్రస్తుతం భారత్ 2-1తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. రాహుల్ ద్రావిడ్ మాట్లాడుతూ.. రోహిత్ను మా వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. అతన్ని ఇంకా ఈ టెస్ట్ నుంచి తప్పించలేదు.' అని ద్రావిడ్ విలేకరుల సమావేశంలో తెలిపాడు.
'అతను అయిదో టెస్ట్కు అందుబాటులో ఉండాలంటే కోవిడ్ టెస్ట్లో నెగెటివ్ రిజల్ట్ పొందాలి. మేము అతనిని పర్యవేక్షిస్తూనే ఉంటాం. మాకు ఇంకా 36గంటల టైం ఉంది కాబట్టి మేము అతనికి ఒకట్రెండు సార్లు కరోనా పరీక్షలు జరుపుతాం. ఆ రిజల్ట్ ఆధారంగా మేము నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతం వైద్య బృందం, స్పోర్ట్స్ సైన్స్ టీమ్ చెప్పే రిజల్ట్ మీదే రోహిత్ ఉంటాడా, ఉండడా అనేది తెలుస్తుంది' అని ద్రావిడ్ పేర్కొన్నాడు. జూన్ 25న నిర్వహించిన రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ (RAT) తర్వాత రోహిత్కు కరోనా పాజిటివ్ వచ్చింది. రోహిత్కు బ్యాకప్ ప్లేయర్గా మయాంక్ అగర్వాల్ను సెలెక్షన్ కమిటీ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇక రోహిత్ గైర్హాజరీ అయితే బుమ్రా కెప్టెన్ కావడం ఖాయంగా కన్పిస్తుంది. వైస్ కెప్టెన్గా రిషబ్ పంత్ అవుతాడని తెలుస్తోంది.
ఇంగ్లాండ్తో 5వ టెస్టుకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, చతేశ్వర్ పుజారా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, మయాంక్ అగర్వాల్