బ్రిస్బేన్: ఆస్ట్రేలియా-భారత్ల జట్ల మధ్య సిరీస్ ప్రారంభమయినప్పటి నుంచి ఇరు జట్లలో ఎవరో ఒక ఆటగాడు గాయపడుతూనే ఉన్నాడు. ఇప్పటికే టీమిండియా నుంచి ఆరుగురు కీలక ఆటగాళ్లు గాయాలతో దూరమవగా.. అటు ఆసీస్నూ గాయాల బెడద వెంటాడుతూనే ఉంది. తాజాగా ఆస్ట్రేలియన్ యువ ఓపెనర్ విల్ పకోస్కీ గాయపడిన సంగతి తెలిసిందే. భారత్తో మూడో టెస్టులో అరంగేట్రం చేసిన పకోస్కీ.. నిర్ణయాత్మక ఆఖరి టెస్టుకు దూరమయ్యే అవకాశం ఉంది.
సిడ్నీ టెస్టు ఐదో రోజు ఆటలో ఫీల్డింగ్ సమయంలో విల్ పకోస్కీ డైవ్ చేయగా.. అతని భుజానికి బలమైన గాయమైంది. నాలుగో టెస్టు ప్రారంభానికి ముందు అతని ఫిట్నెస్ను పరీక్షించి బ్రిస్బేన్ టెస్టుకు ఎంపిక చేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తెలిపింది. ప్రస్తుతం విల్ విశ్రాంతి తీసుకుంటున్నాడని, అతడి భుజం ఎముక పాక్షికంగా పక్కకు జరిగడంతో నొప్పితో బాధపడుతున్నాడని పేర్కొంది.
బ్రిస్బేన్ టెస్టు సమయానికి విల్ పకోస్కీ కోలుకోకుంటే.. మార్కస్ హారిస్ తుది జట్టులోకి వస్తాడని ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ తెలిపాడు. డేవిడ్ వార్నర్ జతగా హారిస్ ఓపెనర్గా బరిలోకి దిగుతాడని చెప్పాడు. గత సంవత్సరం యాషెస్లో హారిస్ చివరిసారిగా ఆడాడు. ఇటీవలి కాలంలో అతడు మంచి ఫామ్లో ఉన్నాడు. విక్టోరియా తరఫున హారిస్ 239 పరుగులు చేశాడు. హారిస్ ఆసీస్ తరపున 9 టెస్టులు ఆడి 385 పరుగులు చేయాడు. రెండు హాఫ్ సెంచరీలు బాదాడు.
విల్ పకోస్కీ టెక్నిక్గా మంచి ప్రతిభావంతుడు. కానీ చిన్నప్పటి నుంచి గాయాలు అతన్ని వేధిస్తూనే ఉన్నాయి. టీమిండియాతో జరిగిన మూడో టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆడిన తొలి టెస్టులోనే రెండు ఇన్నింగ్స్ల్లో వరుసగా 64, 8 పరుగులు చేశాడు. ఆదిలోనే డేవిడ్ వార్నర్ ఔట్ అయినా.. ఆసీస్ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య కీలకమైన నాలుగో టెస్టు బ్రిస్బేన్ వేదికగా జనవరి 15-19 మధ్య జరగనుంది.
స్టీవ్ స్మిత్పై వేటు తప్పదా.. టీమిండియా యువ ఆటగాడికి కెప్టెన్గా అవకాశం!!