ఐపీఎల్ 2026 ఫైనల్కు పీసీబీ చీఫ్?
ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ హాజరుకాబోతున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మే 30, 31 తేదీలలో ఐసీసీ బోర్డు సమావేశం జరగనుంది. అదే వేదికపై మే 31న ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ కూడా షెడ్యూల్ చేయబడింది. ఈ నేపథ్యంలో ఐసీసీ సమావేశానికి వచ్చే ప్రతినిధులంతా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ను కూడా వీక్షిస్తారని భావించారు. అయితే పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఈ సమావేశం కోసం భారత్కు రావడం లేదని స్పష్టమైంది.
పాకిస్థాన్ మీడియాలో ప్రచారమైన కథనాలకు భిన్నంగా.. మొహ్సిన్ నఖ్వీకి బీసీసీఐ నుంచి ఐపీఎల్ ఫైనల్ వీక్షించడానికి ఎలాంటి వ్యక్తిగత ఆహ్వానం అందలేదని తెలిసింది. ఒకవేళ మొహ్సిన్ నఖ్వీ భారత్కు వచ్చినా.. అది కేవలం ఐసీసీ బోర్డు సమావేశంలో పాల్గొనడానికే తప్ప ఐపీఎల్ ఫైనల్ కోసం కాదని స్పష్టమైంది. అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం నఖ్వీతో పాటు మరో ఇద్దరు ఐసీసీ బోర్డు సభ్యులు ఈ సమావేశానికి ప్రత్యక్షంగా హాజరుకాకుండా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్గా పాల్గొననున్నారు. సభ్య దేశాల ప్రతినిధులు వ్యక్తిగతంగా రాలేకపోతే వర్చువల్గా హాజరయ్యేందుకు ఐసీసీ నిబంధనలు అనుమతిస్తాయి.

భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఐసీసీ టోర్నీల భాగస్వామ్యంపై గతంలో కుదిరిన త్రైపాక్షిక ఒప్పందంలో మొహసిన్ నఖ్వీ కీలక పాత్ర పోషించారు. గతేడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో.. 2027 వరకు భారత్, పాకిస్తాన్ జట్లు ఐసీసీ టోర్నమెంట్ల కోసం ఒకరి దేశానికి మరొకరు ప్రయాణించకూడదని నిర్ణయించారు. దీని ప్రకారం భారత్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్కు వెళ్లకుండా తన మ్యాచ్లను దుబాయ్లో ఆడింది. అలాగే భారత్లో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్, పురుషుల టీ20 ప్రపంచకప్ మ్యాచ్లను పాకిస్తాన్ జట్టు శ్రీలంక వేదికగా ఆడింది. ఈ సున్నితమైన సరిహద్దు సంబంధాల నేపథ్యంలోనే నఖ్వీ అహ్మదాబాద్కు రాకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
నిజానికి ఈ ఐసీసీ బోర్డు సమావేశం మార్చి చివరివారంలో ఖతార్లోని దోహాలో జరగాల్సి ఉంది. కానీ అమెరికా-ఇరాన్ యుద్ధ వాతావరణం కారణంగా ఐసీసీ ఈ సమావేశాన్ని వాయిదా వేయడమే కాకుండా వేదికను కూడా మార్చాల్సి వచ్చింది. దాదాపు రెండు నెలల ఆలస్యం తర్వాత ఈ సమావేశాన్ని అహ్మదాబాద్కు మార్చారు. ఐసీసీ సమావేశాన్ని అహ్మదాబాద్కు మార్చడం వల్లే, బీసీసీఐ కూడా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ వేదికను బెంగళూరు నుంచి అహ్మదాబాద్కు మార్చాలని నిర్ణయించిందని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఈ అత్యున్నత స్థాయి ఐసీసీ సమావేశంలో ఐసీసీ బోర్డు డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్లు, కమిటీ సభ్యులు, సీనియర్ నాయకత్వం పాల్గొననున్నారు. ఈ సమావేశంలో చర్చించబోయే అతిపెద్ద ఎజెండా 'బ్రాడ్కాస్టింగ్ రైట్స్' (ప్రసార హక్కులు) అని సమాచారం. ఎందుకంటే జియోస్టార్తో ఐసీసీకి ఉన్న ప్రస్తుత ఒప్పందం 2027తో ముగియనుంది. భవిష్యత్తు క్రికెట్ ప్రసారాలు, గ్లోబల్ క్రికెట్ పాలన వంటి కీలకమైన అంశాలపై ఈ రెండు రోజుల సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications