MS Dhoni IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 దగ్గర పడుతున్న కొద్దీ చెన్నై సూపర్ కింగ్స్(CSK) వెటరన్ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఐపీఎల్ 2025 చివరి సీజన్ అనే ఊహాగానాలు పెరిగిపోయాయి. ఎంఎస్ ధోని కెప్టెన్సీలో సీఎస్కే ఐపీఎల్ చరిత్రలో 5 టైటిళ్లను గెలుచుకుంది. ఎంఎస్ ధోని జట్టుకు కొత్త గుర్తింపును ఇచ్చాడు. ప్రస్తుత సీజన్లో సీఎస్కే జట్టు ప్రదర్శన ఆశించినంతగా లేకపోయినా మైదానంలో ఎంఎస్ ధోనిని చూస్తే చాలని అభిమానులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఎంఎస్ ధోని చిన్ననాటి కోచ్ కేశవ్ రంజన్ బెనర్జీ ఆయన భవిష్యత్ గురించి కీలక ప్రకటన చేశాడు.
వచ్చే ఏడాది ఎంఎస్ ధోని ఆడటం చూడొచ్చు-కేశవ్ రంజన్ బెనర్జీ
ధోని చిన్ననాటి కోచ్ కేశవ్ రంజన్ బెనర్జీ మాట్లాడుతూ.. ఎంఎస్ ధోని ప్రస్తుతం వచ్చే ఏడాదికి యువ సీఎస్కే జట్టును సిద్ధం చేస్తున్నాడని.. అందువల్ల ఆయన ఐపీఎల్ 2026లో కూడా ఆడే అవకాశం ఉందని అన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్లో తన చివరి సంవత్సరమో కాదో ధోనికి మాత్రమే తెలుసన్నాడు. ధోని వీలైనంత కాలం ఆడుతూనే ఉండాలని అందరం కోరుకుంటున్నామన్నారు. సీఎస్కే కోరుకుంటే ఐపీఎల్ 2025కి ముందు జరిగిన వేలంలో ధోనితో సంబధాలు తెంచుకునేది. ధోని కోరుకుంటే మెగా వేలంలో కూడా పాల్గొనేవాడు. అయితే ఈ జట్టును సిద్ధం చేయడానికి ధోని జట్టులోనే ఉండాలని కోరుకున్నాడు. కాబట్టి ధోని తదుపరి ఐపీఎల్లో కూడా ఆడటం మనం చూడవచ్చని కేశవ్ రంజన్ బెనర్జీ చెప్పుకొచ్చాడు.

ధోని నిర్ణయం సీఎస్కేకు మంచిది: సునీల్ గవాస్కర్
అంతకు ముందు భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ ఎంఎస్ ధోని గురించి మాట్లాడుతూ.. తాను సీఎస్కే ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఆడుతున్నాడని చెప్పాడు. ఏ ఆటగాడైనా తన కోసం కాదు, జట్టుకు ఏది మంచిదో దాని గురించి నిర్ణయం తీసుకుంటాడని సునీల్ గవాస్కర్ అన్నాడు. ఈ సీజన్లో ఆడటం విషయంలో ధోని ఏ నిర్ణయం తీసుకున్నా అది సీఎస్కేకు ఖచ్చితంగా మంచిది అవుతుందన్నాడు. భవిష్యత్లో ఎంఎస్ ధోని తీసుకునే ఏ నిర్ణయం అయినా సీఎస్కేకు ఏది ఉత్తమమో దానిపై పూర్తిగా ఆధారపడి ఉంటుందన్నాడు.