2014 ఇంగ్లాండ్ పర్యటన కోహ్లి యావరేజ్ 40 దిగువకి
విదేశాల్లోనూ దూకుడుగా బ్యాటింగ్ చేస్తోన్న కోహ్లి 2014 ఇంగ్లాండ్ పర్యటనలో మాత్రం దారుణంగా విఫలమైయ్యాడు. ఐదు టెస్టుల్లో 13.4 సగటుతో కేవలం 134 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఆ పర్యటన ముగిసే సరికి కోహ్లి యావరేజ్ 40 దిగువకి పడిపోయింది. అతడి కెరీర్లో ఇదే అత్యల్ప సగటు కావడం గమనార్హం.
ఆఫ్ స్టంప్కి దూరంగా వెళ్తున్న బంతిని వెంటాడిన కోహ్లీ:
గత ఇంగ్లాండ్ పర్యటనలో ఆఫ్ స్టంప్కి దూరంగా వెళ్తున్న బంతిని వెంటాడిన కోహ్లి భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ఆఫ్ స్టంప్కి దూరంగా బంతులు విసిరిన జేమ్స్ అండర్సన్ కోహ్లిని తెలివిగా బుట్టలో వేసుకున్నాడు. ఆ సిరీస్లో విరాట్కి 50 బంతులు విసిరిన అండర్సన్ నాలుగుసార్లు పెవిలియన్ చేర్చాడు. కానీ 2016లో భారత గడ్డ మీద అండర్సన్ను కోహ్లి దీటుగా ఎదుర్కొన్నాడు. 112 బంతుల్లో ఒక్కసారి కూడా అవుట్ కాకుండా 69 పరుగులు చేశాడు.
మిగిలిన పర్యటనల్లో దండుకున్న కోహ్లీ:
ఇంగ్లాండ్ పర్యటన తర్వాత భారత జట్టు మూడు దేశాల్లో పర్యటించింది. ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌతాఫ్రికా పర్యటనల్లో కోహ్లినే అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 2014-15లో ఆసీస్ గడ్డ మీద 692 పరుగులు చేసిన కోహ్లి.. 2016లో కరేబియన్ గడ్డపై 251 రన్స్ చేశాడు. ఈ ఏడాది ఆరంభంలో సౌతాఫ్రికాలో 286 పరుగులు చేశాడు. 2016లో సొంత గడ్డ మీద ఇంగ్లాండ్పై 655 పరుగులు దండుకున్నాడు.
బ్యాటింగ్ టెక్నిక్లోని లోపాలను సరిదిద్దుకున్న కోహ్లీ:
ఇంగ్లాండ్ పర్యటన తర్వాత తన బ్యాటింగ్ టెక్నిక్లోని లోపాలను కోహ్లి సరిదిద్దుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో, ప్రాక్టీస్ మ్యాచ్లో మెరుగైన ఆటతీరు కనబరిచాడు. లాంగ్ ఫార్మాట్లో బరిలో దిగుతున్న అండర్సన్ను కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటే భారత్ భారీ స్కోరు సాధించడం పెద్ద కష్టమేం కాబోదు. గత పర్యటనలో తనను ఇబ్బందిపెట్టిన అండర్సన్పై కోహ్లి ప్రతీకారం తీర్చుకుంటాడనే ఎదురుచూస్తున్నారు భారత అభిమానులు.