
చెన్నై: టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ శనివారం అర్ధాంతరంగా అంతర్జాతీయ ఆటకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. దీంతో అభిమానులు ఎంతో బాధపడుతున్నారు. ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు దూరమైనా.. మరో నెల రోజుల్లో ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో ఆడనున్నాడు. అందుకోసం ఇప్పటికే చెన్నైకు చేరుకున్న మహీ.. ఫిట్నెస్ క్యాంప్లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలోనే నిన్న రాత్రి రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఎంఎస్ ధోనీ లక్కీ నెంబర్ 7. జెర్సీ నంబర్ కూడా 7నే. 7 అంటే మహీకి ఎంతో ఇష్టం. మరోవైపు అభిమానులకు కూడా. జెర్సీ నంబర్ 7 ధరించిన మహీ.. ప్రపంచ క్రికెట్లో ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించడంతో పాటు వ్యక్తిగత రికార్డులను కూడా నెలకొల్పాడు. ఇకపై ధోనీ జెర్సీ నంబర్ 7 ఇతర క్రికెటర్లు ధరించకుండా నిషేధం విధించాలని పలువురు క్రికెటర్లతో పాటు అభిమానులు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)ని కోరుతున్నారు.
ఎంఎస్ ధోనీ గౌరవార్థం నంబర్ 7కు శాశ్వత రిటైర్మెంట్ ప్రకటించాలని టీమిండియా వికెట్ కీపర్/బ్యాట్స్మన్ దినేశ్ కార్తీక్ ట్విటర్ వేదికగా కోరాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో జెర్సీ #7కు బీసీసీఐ వీడ్కోలు పలుకుతుందని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశాడు. జీవితంలో ధోనీ సెకండ్ ఇన్నింగ్స్ కూడా గొప్పగా ఉండాలని ఆకాంక్షించాడు. ఈ సందర్భంగా ధోనీతో ప్రపంచకప్ సెమీస్ మ్యాచ్ సమయంలో దిగిన ఫొటోను కార్తీక్ షేర్ చేశాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అతని సేవలకు గుర్తింపుగా.. ఆ జెర్సీని ఇతర క్రికెటర్లు ధరించకుండా బీసీసీఐ నెం.10 జెర్సీకి వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.