
విల్ జాక్స్ ఊచకోతతో ఎంఐ కేప్టౌన్ చిత్తుగా ఓడింది. సౌతాఫ్రికా టీ20 టోర్నీలో భాగంగా ప్రిటోరియా క్యాపిటల్స్, ఎంఐ కేప్టౌన్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఎంఐ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఆ నిర్ణయమే ఎంఐ కొంప ముంచింది. క్యాపిటల్స్ ఓపెనర్గా వచ్చిన విల్ జాక్స్ కేవలం 27 బంతుల్లోనే 62 పరుగులతో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు.
అతనితోపాటు మరో ఓపెనర్ కుశాల్ మెండిస్ (29) కూడా ఫర్వాలేదనిపించాడు. రైలీ రూసో (1) విఫలమైనా థీనుస్ డీ బ్రూన్ (36) రాణించాడు. అయితే ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. ముతుస్వామి (3), క్లైడ్ ఫోర్టూన్ (11), వేన్ పార్నెల్ (1), ఈథన్ బాష్ (7) పరుగులు మాత్రమే చేశారు. జేమ్స్ నీషమ్ (22 నాటౌట్) కూడా అనుకున్నంత వేగంగా పరుగులు చేయలేకపోయాడు. దీంతో ప్రిటోరియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఎంఐ బౌలర్లలో రషీద్ ఖాన్, జోఫ్రా ఆర్చర్ చెరో మూడు వికెట్లతో సత్తా చాటగా.. ఒడియన్ స్మిత్ రెండు వికెట్లు తీసుకున్నాడు.
ఛేజింగ్లో ఎంఐకి శుభారంభం దక్కలేదు. ర్యాన్ రికెల్టన్ (11) నిదానంగా ఆడాడు. మరో ఓపెనర్ డెవాల్డ్ బ్రెవిస్ (46) కూడా అనుకున్నంత వేగంగా ఆడలేకపోయాడు. శామ్ కర్రాన్ (22), రాసీ వాన్ డర్ డస్సెన్ (24) ఫర్వాలేదనిపించారు. అయితే ఆ తర్వాత వచ్చిన ఒక్క బ్యాటర్ కూడా సింగిల్ డిజిట్ స్కోరు దాటలేదు. దీంతో ఆ జట్టు 18.1 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌట్ అయింది. ప్రిటోరియా జట్టులో కెప్టెన్ వేన్ పార్నెల్, ఆన్రిచ్ నోర్యీ చెరో మూడు వికెట్లతో ఆకట్టుకున్నారు. అదిల్ రషీద్ రెండు వికెట్లు తీసుకోగా.. విల్ జాక్స్, ఈథన్ బాష్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. బ్యాటుతో విరుచుకుపడి ప్రిటోరియాకు భారీ స్కోరు అందించిన విల్ జాక్స్కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.