హైదరాబాద్: ఇప్పటికే ఇంగ్లాండ్ గడ్డపై రెండు సిరీస్లు పూర్తి చేసుకున్న టీమిండియా.. మూడో సిరీస్కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆగష్టు1 నుంచి ప్రారంభం కాబోతున్న టెస్టు సిరీస్కు ఏర్పాట్లు మొదలైయ్యాయి. దాని కోసం ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ బుధవారం భారత జట్టును ఎంపిక చేయనుంది. పూర్తి సిరీస్కు జట్టును ఎంపిక చేస్తారా.. లేదా ముందు రెండు మూడు టెస్టులకు మాత్రమే జట్టును ప్రకటిస్తారా అనే విషయంపై స్పష్టత లేదు.
ప్రతిష్టాత్మక సిరీస్ కావడంతో 18 మందితో జట్టును ప్రకటించే అవకాశముంది. గత కొంత కాలంగా టెస్టు జట్టుకు దూరంగా ఉంటున్న రోహిత్ శర్మకు ఈ సిరీస్లో సెలక్టర్లు చోటిస్తారా లేదా అన్నదానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. దక్షిణాఫ్రికా పర్యటనలో ఘోరంగా విఫలమవడంతో అతడిపై సెలక్టర్లు వేటు వేశారు. అఫ్గానిస్థాన్తో ఏకైక టెస్టుకు రోహిత్ను ఎంపిక చేయలేదు. రోహిత్కు ఇప్పటికే లెక్కలేనన్ని అవకాశాలు లభించినా అతను సద్వినియోగం చేసుకోలేదు.
ఐతే ఇంగ్లాండ్తో టీ20, వన్డే సిరీస్ల్లో కలిపి రెండు సెంచరీలు, ఓ అర్ధసెంచరీతో రోహిత్ సత్తా చాటుకున్న నేపథ్యంలో అతడిని మళ్లీ టెస్టు జట్టులోకి తీసుకునే అవకాశాల్ని కొట్టిపారేయలేం. రిజర్వ్ వికెట్ కీపర్గా రిషబ్ పంత్ను ఎంచుకునేందుకు ఆస్కారముంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న కుల్దీప్ యాదవ్పైనా సెలక్టర్లు దృష్టిపెట్టారు. అతడిని మూడో స్పిన్నర్గా ఎంపిక చేస్తారా, లేక జడేజాను తప్పిస్తారా అన్నది చూడాలి.
మూడో ఓపెనర్గా రాహుల్ ఎంపిక ఖాయం. వికెట్ కీపర్లుగా సాహా, దినేశ్ కార్తీక్ ఇద్దరినీ ఎంపిక చేసే అవకాశముంది. పేస్ విభాగంలో భువనేశ్వర్, బుమ్రా, ఉమేశ్ యాదవ్, ఇషాంత్లకు చోటు పక్కా. షమి విషయంలోనే కొంచెం సందిగ్ధత నెలకొంది.