వచ్చే సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ మహేంద్ర సింగ్ ధోనీ అందుబాటులో ఉంటాడా లేదా అనే ఉత్కంఠ అందరిలో కొనసాగుతోంది. రిటైర్మెంట్ తీసుకుని అయిదేళ్గు గడిచిన ఆటగాళ్లను అన్క్యాప్డ్ ప్లేయర్ పరిగణిస్తూ గత నిబంధనను బీసీసీఐ తిరిగి అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయం సీఎస్కేకు జాక్పాట్లా తగిలింది. ధోనీని కేవలం రూ.4 కోట్లకే రిటైన్ చేసుకునే అవకాశం చెన్నై ఫ్రాంచైజీకి దక్కింది.
''ఓ భారత ప్లేయర్ అన్క్యాప్డ్ ప్లేయర్గా ఇలా పరిగణిస్తారు. గత అయిదేళ్ల క్యాలెండ్ ఇయర్లో అంతర్జాతీయ క్రికెట్లో ఏ ఫార్మాట్లో అయినా తుదిజట్టులో కూడా చోటు దక్కించుకోని ఆటగాళ్లు, అలాగే ఆ సదరు ప్లేయర్లు బీసీసీఐతో సెంట్రల్ కాంట్రక్ట్ కూడా లేకుండా ఉంటే అన్క్యాప్డ్గా పరిగణిస్తారు. ఇది భారత ఆటగాళ్లకు మాత్రమే వర్తిస్తుంది'' అని బీసీసీఐ నిబంధన వెల్లడించింది.

ఈ నిబంధనను ఎంఎస్ ధోనీ గురించే బీసీసీఐ తిరిగి తీసుకువచ్చిందని వాదనలు గట్టిగానే వినిపించాయి. మాజీ క్రికెటర్లు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. అయితే అందుబాటులో ఉండటంపై ధోనీ ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదని సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న విశ్వనాథన్ ధోనీ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.
''చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ధోనీ ఆడాలని మేం కోరుకుంటున్నాం. కానీ ధోనీ తన అందుబాటు గురించి ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. అక్టోబర్ 31వ తేదీ లోపు చెప్తానని ధోనీ అన్నాడు. అతను ఆటను కొనసాగిస్తాడని ఆశిస్తున్నా'' అని చెప్పాడు. గత ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు సీఎస్కే కెప్టెన్సీని ధోనీ వదిలివేసిన సంగతి తెలిసిందే. సారథి బాధ్యతలు రుతురాజ్ గైక్వాడ్కు అందించాడు. అయితే ఐపీఎల్ 2024 సీజన్ ముగిసిన వెంటనే ధోనీ ముంబైలో సర్జరీ చేయించుకున్నాడు. కాగా, 43 ఏళ్ల ధోనీ మోకాలి నొప్పితో ఇప్పటికీ కాస్త ఇబ్బంది పడుతున్నాడని తెలుస్తోంది.