
ఉన్నది ఏడాది కాలమే అయినా
కోచ్గా అనిల్ కుంబ్లే ఉన్నది ఏడాది కాలమే అయినప్పటికీ, ఆ పదవికే కుంబ్లే వన్నె తెచ్చాడు. గతేడాది వెస్టిండీస్ పర్యటనతో కోచ్గా కుంబ్లే ప్రస్థానం ఆరంభమైన సంగతి తెలిసిందే. అక్కడ టెస్టు సిరీస్లో భారత్ 2-0తో విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన టీ20 సిరీస్ ఓడింది. కుంబ్లే హయాంలో భారత్ కోల్పోయిన ఏకైక ద్వైపాక్షిక సిరీస్ ఇదే.

12 టెస్టుల్లో విజయం
ఆ తర్వాత సొంతగడ్డపై భారత్ వరుసగా న్యూజిలాండ్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలపై సిరీస్లు కైవసం చేసుకుంది. ఇలా స్వదేశంలో ఆడిన టెస్టుల్లో ఒక్కదాంట్లో మాత్రమే ఓడి ఏకంగా 12 టెస్టుల్లో విజయం సాధించింది. టెస్టు ర్యాంకుల్లో నెంబర్ వన్ స్ధానంలో నిలిచింది. కుంబ్లే చివరగా బాధ్యతలు నిర్వర్తించిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ రన్నరప్గా నిలిచింది.

కోచ్గా కుంబ్లే విజయాలను అందుకోవడం కష్టం
కోచ్గా అతను సాధించిన విజయాలను అంత తక్కువ సమయంలో మరొకరు అందుకోవడం చాలా కష్టమని సెహ్వాగ్ తెలిపాడు. 'అతని కోచింగ్ శైలిపై ఎలాంటి కామెంట్ చేయదలుచుకోలేదు. ఏ ఇతర సీనియర్, ఆటగాడైనా అతని కంటే మెరుగైన ప్రదర్శన ఇవ్వడంలో విజయం సాధించలేరు' అని సెహ్వాగ్ తెలిపాడు.

విదేశీ కోచ్ కంటే స్వదేశీ కోచ్ అయితేనే మంచిది
విదేశీ కోచ్ కంటే స్వదేశీ కోచ్ అయితేనే జట్టుకు మంచిదని సెహ్వాగ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. స్వదేశీ కోచ్ అయితే జట్టుతో సంభాషించగలడని తెలిపాడు. తన అభిప్రాయాన్ని హిందీతో పాటు ఇంగ్లీషులో వెల్లడించొచ్చని, ఇలా చేయడం ద్వారా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించ వచ్చని సెహ్వాగ్ తెలిపాడు.

సెహ్వాగ్ సైతం కోచ్ పదవికి దరఖాస్తు
ప్రధాన కోచ్ పదవికి గతంలో బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించగా సెహ్వాగ్ ఈ పదవికి దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా బీసీసీఐ మరోసారి కోచ్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆటగాడు రవిశాస్త్రి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని, రవిశాస్త్రికి కోహ్లీ మద్దతు ఉందని కూడా వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications