టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇటీవల రాయుడు రాజకీయల్లో తీసుకున్న నిర్ణయాలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకున్న అతడు కొన్ని రోజుల్లోనే పార్టీ వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.
అయితే అంబటి రాయుడు తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యాడు. సమావేశానికి గల కారణాలు వెల్లడించనప్పటికీ ఇది హాట్ టాపిక్గా మారింది. అయితే జనసేన పార్టీలో రాయుడు చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పవన్ కళ్యాణ్తో ఆయన చర్చించినట్టు సమాచారం. అంతేకాకుండా నిన్నటి నుంచి రాయుడు ఇన్స్టాగ్రామ్లో జనసేన పేజీని ఫాలో అవ్వడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.

అంబటి రాయుడు తొలి నుంచి జగన్ సర్కార్పై పాజిటివ్గానే స్పందిస్తూ వచ్చాడు. దీంతో అంబటి వైసీపీలో చేరడం ఖాయంగా కనిపించింది. అదే జరిగింది కూడా. కానీ గుంటూరు సీటు ఆశించి భంగపడటంతో వైసీపీ తీర్థం పుచ్చుకున్న 10 రోజుల్లోనే పార్టీకి గుడ్ బై చెప్పాడు. ఇదంతా పెద్ద చర్చకు దారితీయడంతో తాను ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నందున కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని భావించినట్లు పేర్కొని ఈ చర్చకు ఎండ్ కార్డ్ వేశాడు.
తిరిగి నిన్న జనసేన సోషల్ హ్యాండిల్ను ఫాలో అవడంతో మళ్లీ అంబటి రాజకీయ ఎంట్రీపై వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే అంబటి రాయుడు తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు తన క్రికెట్ కెరీర్ను అంధకారంలోకి నెట్టేశాయనే విమర్శలు ఉన్నాయి. తాజాగా రాజకీయాల్లో కూడా అంబటి రాయుడు తొందరపాటు నిర్ణయాలతో నష్టమే తప్ప, అతనికి కలిసొచ్చే అంశంలా కనిపించడం లేదని పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.
కాగా, 2019 వన్డే వరల్డ్ కప్లో చోటు దక్కకపోవడంతో రాయుడు క్రికెట్కు గుడ్ బై ప్రకటించాడు. కానీ తిరిగి రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుని ఐపీఎల్ ఆడాడు. గత ఐపీఎల్ సీజన్ చివరిదని ముందే ప్రకటించి 2023లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. తాజాగా దుబాయ్ వేదికగా జరగనున్న ILT20లో ముంబై తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నట్లు తెలిపాడు. దీని కోసమే రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించాడు. కానీ పవన్ కళ్యాణ్తో భేటీ అవ్వడం గమనార్హం.
ILT20 జనవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఆరు జట్లు తలపడే ఈ టోర్నీ ఫిబ్రవరి 17 వరకు జరగనుంది. ముంబయి జట్టుకు నికోలస్ పూరన్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కాగా, ముంబయి ఫ్రాంచైజీలో అంబటి రాయుడు పదేళ్ల పాటు ఆడాడు. ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ తరపునే రాయుడు అరంగేట్రం చేశాడు.