హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీమిండియా పేసర్ మహమ్మద్ షమి త్వరగా కోలుకోవాలని అల్లాను ప్రార్థిస్తున్నట్లు ఆయన భార్య హసీన్ జహాన్ తెలిపారు. సోమవారం తన కుమార్తెతో సహా షమీ నివాసానికి వెళ్లి గాయపడ్డ షమీని ఆమె పరామర్శించారు. డెహ్రడూన్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా షమీ ప్రయాణిస్తున్న కారు ఓ ట్రక్కును ఢీకొన్న సంగతి తెలిసిందే.
ఈ రోడ్డు ప్రమాదంలో ఘటనలో షమీ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ నేపథ్యంలో షమి భార్య హసీన్ జహాన్ మాట్లాడుతూ 'షమీకి చెడు జరగాలని నేనెప్పుడూ కోరుకోను. అతను నాకు శత్రువేమి కాదు. అతను ఆరోగ్యంగా లేకపోతే నేను సంతోషంగా ఉండలేను. గాయాలపాలైన షమి త్వరగా కోలుకోవాలని అల్లాను ప్రార్థిస్తున్నా' అని హసీన్ తెలిపింది.
జహాన్ షమీని కలిసిన విషయాన్ని ఆమె లాయర్ జాకీర్ హుస్సెన్ సైతం ధృవీకరించారు. కోల్కతాలోని లాల్బజార్ పోలీస్ హెడ్ క్వార్టర్స్కు సమాచారమిచ్చి కూతురితో సహా జహాన్ షమీని కలిసిందని ఆయన మీడియాకు తెలిపారు. ప్రస్తుతం భార్య పెట్టిన కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న షమీ బెంగాల్ మాజీ క్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్ అకాడమీలో సాధన చేసి తిరిగి వస్తుండగా కారు ప్రమాదానికి గురైంది.
ఇదిలా ఉంటే షమీకి ఇతర మహిళలతో అక్రమ సంబంధాలున్నాయని, తనను తీవ్రంగా వేధించాడని హసీన్ జహాన్ కోల్కతా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటికే దర్యాప్తుని కొనసాగిస్తున్నారు. మ్యాచ్ ఫిక్సింగ్కు సైతం పాల్పడ్డాడని ఆరోపణలు చేయడంతో బీసీసీఐ విచారణకు ఆదేశించింది.
బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చేపట్టిన విచారణలో షమీకి క్లీన్ చీట్ రావడంతో వార్షిక వేతన కాంట్రాక్టు పునరుద్దరించడంతో పాటు ఐపీఎల్ ఆడేందుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.