లేక లేక జాతీయ జట్టులోకి పునరాగమనం చేసిన భర్త.. సెంచరీ కొట్టి జట్టును దాదాపు గెలిపించినంత పని చేశాడు. అలాంటి దృశ్యాన్ని స్టేడియంలో కూర్చొని లైవ్గా చూసిన భార్య సంతోషాన్ని ఎవరు ఆపగలరు. ఆమె అలా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకోవడం చూసిన వాళ్ల కళ్లు కూడా చెమర్చాయి. ఇదంతా పాకిస్తాన్, న్యూజిల్యాండ్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్టులో జరిగిన ఘటనే. దాదాపు ఐదేళ్ల తర్వాత పాకిస్తాన్ జట్టులో పునరాగమనం చేసిన మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్ ఈ సిరీస్లో అద్భుతంగా రాణించాడు.
ఆడిన నాలుగు ఇన్నింగ్సుల్లో మూడింట హాఫ్ సెంచరీలతో సర్ఫరాజ్ ఆకట్టుకున్నాడు. ఇక కివీస్తో జరిగిన రెండో టెస్టు చివరి ఇన్నింగ్స్లో పాక్ జట్టు 77/4 స్కోరుతో కష్టాల్లో ఉండగా మైదానంలోకి వచ్చాడు. కెప్టెన్ బాబర్ ఆజమ్ (27) విఫలమైన చోటే.. సర్ఫరాజ్ అద్భుతమైన పట్టుదల ప్రదర్శించాడు. ఈ క్రమంలోనే 176 బంతుల్లో 118 పరుగులు చేసి పాక్ను దాదాపు గెలిపించాడు. అతను సెంచరీ చేసినప్పుడు సర్ఫరాజ్ భార్య.. స్టేడియంలోనే ఉంది. ఎనిమిదేళ్ల తర్వాత భర్త అంతర్జాతీయ సెంచరీ చేయడం, అది కూడా తన హోం గ్రౌండ్లోనే చేయడం చూసిన ఆమె సంతోషంతో కన్నీటి పర్యంతం అయింది.
దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సిరీస్లో సర్ఫరాజ్ 335 పరుగులతో రాణించాడు. రెండో టెస్టులో జట్టును ఒంటి చేత్తో విజయానికి చేరువ చేశాడు. అయితే అతను అవుటైన తర్వాత మిగతా ఆటగాళ్లు క్రీజులో ఎక్కువ సేపు నిలవలేదు. చివర్లో మూడు ఓవర్లు ఉన్నాయనగా లైట్ సరిగా లేదనే కారణంతో అంపైర్లు మ్యాచ్ను నిలిపేశారు. ఈ సిరీస్లో అద్భుతంగా రాణించిన సర్ఫరాజ్ ఖాన్కు 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు దక్కింది.