
వికెట్లు తీయడమే ముఖ్యం:
రెండో రోజు ఆట ముగిసిన తర్వాత ఉమేశ్ యాదవ్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఈ సిరీసులో ఇప్పటికే మూడు శతకాలు బాదిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ను ఔట్ చేయడంపై మీ స్పందన ఏంటని ఓ విలేకరి అడిగాడు. అందుకు ఉమేశ్ తనదైన శైలిలో బదులిచ్చాడు. 'పెద్ద వికెట్ పడినప్పుడల్లా నేను ఎదుర్కొనే సాధారణ ప్రశ్న ఇది. ఓ ఫాస్ట్ బౌలర్గా వికెట్లు తీయడమే నాకు ముఖ్యం. అది జో రూట్ లేదా ఓలి రాబిన్సన్.. ఎవరైనా ఒకటే. ఏ వికెట్ అయినా నాకు ప్రత్యేకమే. నా వరకు అయితే.. ఓ ఫాస్ట్ బౌలర్గా వికెట్ తీయడం చాలా ముఖ్యం' అని ఉమేశ్ బదులిచ్చాడు. ఉమేష్ చివరిసారిగా డిసెంబర్ 26, 2020లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఆడాడు. 9 నెలల తర్వాత ఉమేష్ మళ్లీ భారత తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.

భారీ స్కోరు తప్పకుండా చేస్తారు:
'ప్రస్తుతం పిచ్ బ్యాటింగ్కు పూర్తిగా అనుకూలిస్తోంది. తొలి ఇన్నింగ్స్లో పిచ్లో కాస్త తేమ ఉంది. బౌన్స్ కూడా లభించింది. పైగా వాతావరణం కూడా చల్లగా ఉంది. ఇప్పుడు మా బ్యాట్స్మెన్ నిలకడగా ఆడుతున్నారు. అందుకే రెండో ఇన్నింగ్స్లో మేం మంచి స్కోరు చేస్తామన్న నమ్మకం ఉంది. మా బ్యాటర్లను చూస్తుంటే.. భారీ స్కోరు తప్పకుండా చేస్తారు. కోహ్లీసేన విజయం సాధించేందుకు ఏ మార్గాన్నీ వదలిపెట్టదు. అత్యుత్తమ ఆట ఆడేందుకే ప్రయత్నిస్తున్నాం' అని ఉమేశ్ యాదవ్ అన్నాడు. ఉమేష్ భారత్ తరఫున 48 టెస్టులు, 75 వన్డేలు, 7 టీ20లు ఆడాడు.

కొన్ని పొరపాట్లు చేశాం:
'రెండో రోజు మొదటలో 40 నిమిషాల్లోనే 2 వికెట్లు తీశాం. ఆ తర్వాత బంతిపై పట్టు తగ్గింది. కేవలం ఏడెనిమిది ఓవర్లలోనే 40-45 పరుగులు ఇచ్చాం. దాంతో ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ లయ అందుకున్నారు. ఆ తర్వాత ఏం చేయాలో అందరికి తెలుసు ఉంటుంది. ఇంగ్లీష్ జట్టు అదే చేసింది. వికెట్లు తీసేందుకు మేం బాగానే ప్రయత్నించాం. కానీ పిచ్ నుంచి ఎలాంటి సహకారం అందలేదు. వరుస బౌండరీలు బాదిన తర్వాత బ్యాట్స్మెన్ పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తారు. మేం కొన్ని పొరపాట్లు చేశాం. వికెట్లు తీసిన తర్వాత మరింత కట్టుదిట్టంగా బంతులు వేయాల్సింది. మేం కొన్ని పరుగులు ఎక్కువే ఇచ్చాం' అని ఉమేశ్ యాదవ్ పేర్కొన్నాడు.

శిక్షణ ఎవరూ ఆపరు:
మ్యాచులు ఆడినా, ఆడకపోయినా ఆటగాళ్లంతా లయలో ఉండేలా కోచింగ్ బృందం దృష్టి పెడుతుందని ఉమేశ్ యాదవ్ చెప్పుకొచ్చాడు. 'తుది జట్టులో లేనంత మాత్రాన సాధన, శిక్షణ ఎవరూ ఆపరు. ఎందుకంటే జట్టులో మనం ఎప్పుడూ భాగమే. నెట్స్లో ఎప్పుడూ సాధన చేస్తూనే ఉండాలి. బంతులు అదేపనిగా విసురుతుండాలి. అలా లయ కొనసాగుతుంది. ఏ ఆటగాడికి ఎప్పుడైనా తుది జట్టులో ఆడే అవకాశం రావొచ్చు. అందుకే ఫిజియోలు, శిక్షకులు, బౌలింగ్ కోచ్, సహాయబృందం మమ్మల్ని కఠినంగా సాధన చేయిస్తుంటారు' అని భారత పేసర్ ఉమేశ్ యాదవ్ చెప్పాడు.


Click it and Unblock the Notifications












