దుబాయ్: వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఒత్తిడి మేరకే తాను అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు చెప్పాల్సి వచ్చిందని ఆ దేశ దిగ్గజ టెస్ట్ క్రికెటర్ చందర్పాల్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం మాస్టర్ ఛాంపియన్స్ లీగ్లో ఆడుతున్న చందర్పాల్ వెస్టిండీస్ తరఫున టెస్టుల్లో ఎక్కువ పరుగులు చేసిన రెండో క్రికెటర్గా రికార్డు సృష్టించాడు.
అయితే, చందర్పాల్ వాదనను వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్(డబ్ల్యూఐసిడి) కొట్టిపారేసింది. తాము చందర్పాల్పై ఎలాంటి ఒత్తిడి చేయలేదని స్పస్టం చేసింది. మాజీ క్రికెటర్లు ఆడే మాస్టర్స్ ఛాంపియన్ లీగ్లో చందర్పాల్ ఆడేందుకు తాము నిరంభ్యంతర ధృవీకరణ పత్రం (నో అబ్జెక్జన్ సర్టిఫికెట్) కూడా ఇచ్చామని తెలిపింది.

నిరుడు ఫేలవ ఫాంతో జట్టు నుంచి స్థానం కోల్పోయిన చందర్పాల్ మళ్లీ మైదానంలో నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా వెస్టిండీస్ బోర్డును అభ్యర్థించాడు. అయితే ఆస్ట్రేలియాలో పర్యటించే టెస్టు జట్టులో చందర్పాల్కు సెలక్టర్లు మొండిచేయి చూపడంతో జనవరి 23న క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ఈ 41 ఏళ్ల క్రికెటర్ ప్రకటించాడు.
రెండు దశాబ్దాల పాటు దేశం తరఫున ఆడిన తనకి ఈ విధమైన వీడ్కోలు పలకడం ద్వారా యువ క్రికెటర్లకి ఎలాంటి సందేశం పంపుతున్నారని బోర్డుకు చందర్పాల్ చురక అంటించాడు. మాస్టర్ ఛాంపియన్స్ లీగ్లో పాల్గొనేందుకు 'నిరభ్యంతర పత్రాన్ని' తాను వెస్టిండీస్ బోర్డు నుంచి అందుకున్నట్లు చందర్పాల్ వెల్లడించాడు.
1994, మార్చిలో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్తో టెస్టు క్రికెట్లోకి అరంగేట్రం చేసిన చందర్పాల్ 164 టెస్టుల్లో 11,867 పరుగులు చేయగా.. మరో దిగ్గజ ఆటగాడు బ్రయాన్ లారా 11,953 పరుగులతో టెస్టుల్లో అగ్రస్థానంలో ఉన్నాడు.