
అబుదాబి: టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12లో భాగంగా అబుదాబి వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న మ్యాచులో శ్రీలంక భారీ స్కోర్ చేసింది. లంక నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 189 రన్స్ చేసి.. విండీస్ ముందు 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ పాథమ్ నిస్సాంక (51; 41 బంతుల్లో 5 ఫోర్లు), యువ ప్లేయర్ చరిత్ అసలంక (68; 41 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్) హాఫ్ సెంచరీలు చేశారు. ఇక కెప్టెన్ దాసున్ శనక 14 బంతుల్లో 25 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్ ఆండ్రీ రసెల్ రెండు వికెట్లు పడగొట్టాడు. విండీస్ స్టార్ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో తన కోటా నాలుగు ఓవర్లలో 42 పరుగులు ఇచ్చి ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన శ్రీలంకకు మంచి ఆరంభం దక్కింది. ఓపెనర్లు పాథమ్ నిస్సాంక, కుషాల్ పెరీరాలు ఆచితూచి ఆడారు. క్రీజులో కుదురుకున్నాక మాత్రం ధాటిగా ఆడారు. దాంతో లంక స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. నిస్సాంక, పెరీరా తొలి వికెట్కు 42 పరుగులు జోడించారు. ధాటిగా ఆడిన పెరీరా ఔటైన తర్వాత క్రీజ్లోకి వచ్చిన చరిత్ అసలంకతో కలిసి నిస్సాంక చెలరేగిపోయాడు. ఒకవైపు స్ట్రైక్ రొటేట్ చేస్తూనే.. మరోవైపు బౌండరీలు బాదాడు. వీరిద్దరూ కలిసి 91 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. ఈ క్రమ్మలో నిస్సాంక హాఫ్ సెంచరీ చేశాడు. ఆపై కొద్దిసేపటికే నిస్సాంక ఔట్ అయ్యాడు.
నిస్సాంక ఔట్ అయిన అనంతరం చరిత్ అసలంక లంక బాధ్యతను తీసుకున్నాడు. బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే అతడు ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. ఆపై 68 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అసలంక పెవిలియన్ చేరినా.. చివర్లో కెప్టెన్ దాసున్ శనక దూకుడుగా ఆడాడు. కీలకమైన మ్యాచ్లో లంకపై వెస్టిండీస్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. విండీస్ బౌలర్లలో ఆండ్రీ రసెల్ 2, డ్వేన్ బ్రావో ఒక వికెట్ తీశారు. రవి రాంపాల్ (3-0-31-0), జాసన్ హోల్డర్ (4-0-37-0), అకీల్ హుస్సేన్ (2-0-22-0) పెద్దగా ప్రభావం చూపలేదు. బ్రావో వికెట్ తీసినా (1/42) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. సెమీస్ అవకాశాలు లంక ఎలాగూ లేవు.. భారీ లక్ష్యాన్ని ఛేదిస్తే విండీస్కి ఛాన్స్లు సజీవంగా ఉంటాయి.