గయనా వేదికగా పసికూన పపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్లో ఆతిథ్య జట్టు వెస్టిండీస్ అయిదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీ20 వరల్డ్ కప్లో ఘనంగా బోణీ కొట్టింది. అయితే న్యూ గినియా జట్టు అంత ఈజీగా ఓటమిని అంగీకరించలేదు. గొప్పగా పోరాడింది. ఓ దశలో విండీస్ను ఓడించి సంచలనం సృష్టించేలా కనిపించింది. కానీ రోస్టన్ ఛేజ్ (42 నాటౌట్, 27 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రసెల్ (15; 9 బంతుల్లో, 1 సిక్సర్) పసికూన ఆశలపై నీళ్లు చల్లారు.
తొలుత బ్యాటింగ్ చేసిన పపువా న్యూ గినియా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 136 పరుగులు చేసింది. సెసే బావూ (50; 43 బంతుల్లో, 6 ఫోర్లు, 1 సిక్సర్), ప్లిన్ (25 నాటౌట్; 17 బంతుల్లో, 3 ఫోర్లు) రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలో రసెల్, అల్జారీ జోసెఫ్ చెరో రెండు, హోస్సేన్, షెఫార్డ్, మొయెట్జీ తలో వికెట్ తీశారు. అనంతరం ఛేదనలో విండీస్ 19 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది.

అయితే ఛేజింగ్కు దిగిన వెస్టిండీస్కు ఆదిలోనే షాక్ తగిలింది. జాన్సన్ చార్లెస్ను అలెయ్ గోల్డెన్ డకౌట్ చేశాడు. వన్డౌన్లో వచ్చిన నికోలస్ పూరన్ (27; 27 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు)తో కలిసి ఓపెనర్ (34; 29 బంతుల్లో, 7 ఫోర్లు) ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించారు. నిలకడగా ఆడుతూ పవర్ప్లేలో 52 పరుగులు సాధించారు. ఆ తర్వాత పపువా న్యూ గినియా బౌలర్లు పుంజుకుని స్వల్ప వ్యవధిలోనే కుదురుకున్న బ్యాటర్లను పెవిలియన్కు చేర్చారు.
కాసేపటికే రోవ్మన్ పావెల్ (15; 14 బంతుల్లో, 2 ఫోర్లు), రూథర్ఫర్డ్ (2; 7 బంతుల్లో) కూడా ఔటయ్యారు. దీంతో 16 ఓవర్లకు వెస్టిండీస్ 97/5తో నిలిచింది. అయితే అదే జోరును పపువా న్యూ గినియా బౌలర్లు కొనసాగించలేకపోయారు. చివరి మూడు ఓవర్లకు విండీస్కు 31 పరుగులు అవసరమవ్వగా అసాద్ వలా 18 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో మ్యాచ్ ఆతిథ్య జట్టు వైపు మళ్లింది. ఆ తర్వాత రసెల్, ఛేజ్ ఎలాంటి పొరపాటు చేయకుండా మ్యాచ్ను ముగించారు.
రాణించిన సెసే బావూ
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పపువూ న్యూ గినియాకు పేలవారంభం దక్కింది. ఆదిలోనే కీలక వికెట్లు కోల్పోయింది. టోనీ (2; 5 బంతుల్లో), లెగా (1; 2 బంతుల్లో), అసాద్ వలా (21; 22 బంతుల్లో; 2 ఫోర్లు, 1 సిక్సర్) వరుసగా ఔటయ్యారు. దీంతో పవర్ప్లేలో ఆ జట్టు 34 పరుగులే సాధించింది. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన సెసే బావూ ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. నిలకడగా ఆడుతూ స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు.
కానీ మరో ఎండ్లో సహచరులు వరుసగా పెవిలియన్కు చేరారు. హిరి హిరి (2; 6 బంతుల్లో), చార్లిస్ అమిని (12; 14 బంతుల్లో) ఔటయ్యారు. దీంతో సెసే బావూ గేర్ మార్చి దూకుడు పెంచాడు. 42 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. అయితే ఆ తర్వాత వెంటనే వికెట్ చేజార్చుకున్నాడు. ఆఖర్లో కిప్లిన్ (25 నాటౌట్; 17 బంతుల్లో, మూడు ఫోర్లు), చాద్ సోపెర్ (10; 9 బంతుల్లో, 1 ఫోర్) బ్యాటుకు పనిచెప్పడంతో పపువా 136 పరుగులు చేసింది.