గయనా వేదికగా జరుగుతున్న మ్యాచ్లో ఆతిథ్య జట్టు వెస్టిండీస్కు పపువా న్యూ గినియా 137 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సెసే బావూ (50; 43 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్), కిప్లిన్ (25 నాటౌట్; 17 బంతుల్లో, మూడు ఫోర్లు) పోరాడటంతో విండీస్ ముందు మోస్తారు లక్ష్యాన్నే ఉంచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పపువా న్యూ గినియా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది.
పపువూ న్యూ గినియాకు పేలవారంభం దక్కింది. ఆదిలోనే కీలక వికెట్లు కోల్పోయింది. టోనీ (2; 5 బంతుల్లో), లెగా (1; 2 బంతుల్లో), అసాద్ వలా (21; 22 బంతుల్లో; 2 ఫోర్లు, 1 సిక్సర్) వరుసగా ఔటయ్యారు. దీంతో పవర్ప్లేలో ఆ జట్టు 34 పరుగులే సాధించింది. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన సెసే బావూ ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. నిలకడగా ఆడుతూ స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు.

కానీ మరో ఎండ్లో సహచరులు వరుసగా పెవిలియన్కు చేరారు. హిరి హిరి (2; 6 బంతుల్లో), చార్లిస్ అమిని (12; 14 బంతుల్లో) ఔటయ్యారు. దీంతో సెసే బావూ గేర్ మార్చి దూకుడు పెంచాడు. 42 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. అయితే ఆ తర్వాత వెంటనే వికెట్ చేజార్చుకున్నాడు. ఆఖర్లో కిప్లిన్ (25 నాటౌట్; 17 బంతుల్లో, మూడు ఫోర్లు), చాద్ సోపెర్ (10; 9 బంతుల్లో, 1 ఫోర్) బ్యాటుకు పనిచెప్పడంతో పపువా 136 పరుగులు చేసింది.
పపువా న్యూ గినియా చివరి మూడు ఓవర్లలో 37 పరుగులు చేసింది. వెస్టిండీస్ బౌలర్లలో రసెల్, అల్జారీ జోసెఫ్ చెరో రెండు వికెట్లు తీశారు. హోస్సేన్, షెఫార్డ్, మొయెట్జీ తలో వికెట్ తీశారు. కాగా, ఈ మ్యాచ్కు అభిమానులు చాలా తక్కువగా వచ్చారు. స్టేడియంలో స్టాండ్స్ ఖాళీగా కనిపించాయి.