టీ20 వరల్డ్ కప్-2024లో ఆతిథ్య జట్టు వెస్టిండీస్ బోణీ కొట్టింది. గయనా వేదికగా పసికూన పపువా న్యూ గినియాతో ఆదివారం జరిగిన మ్యాచ్లో విండీస్ అయిదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే న్యూ గినియా జట్టు అసాధారణంగా పోరాడింది. అంత ఈజీగా ఓటమిని అంగీకరించలేదు. ఓ దశలో వెస్టిండీస్ను ఓడించి సంచలనం సృష్టించేలా కనిపించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన పపువా న్యూ గినియా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 136 పరుగులు చేసింది. సెసే బావూ (50; 43 బంతుల్లో, 6 ఫోర్లు, 1 సిక్సర్), ప్లిన్ (25 నాటౌట్; 17 బంతుల్లో, 3 ఫోర్లు) రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలో రసెల్, అల్జారీ జోసెఫ్ చెరో రెండు, హోస్సేన్, షెఫార్డ్, మొయెట్జీ తలో వికెట్ తీశారు. అనంతరం ఛేదనలో విండీస్ 19 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది.

వెస్టిండీస్ ఛేజింగ్ ఉత్కంఠగా సాగింది. పేలవారంభం తర్వాత ఛేదన సాఫీగా సాగింది. కానీ మిడిల్ ఓవర్లలో పపువా బౌలర్లు పుంజుకుని మ్యాచ్ తమ వైపు తిప్పుకున్నారు. దీంతో 16 ఓవర్లకు వెస్టిండీస్ 97/5తో నిలిచింది.అయితే అదే జోరును పపువా కొనసాగించలేకపోయింది. రోస్టన్ ఛేజ్ (42 నాటౌట్, 27 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రసెల్ (15; 9 బంతుల్లో, 1 సిక్సర్) పసికూన ఆశలపై నీళ్లు చల్లారు.
కాగా, మ్యాచ్ అనంతరం వెస్టిండీస్ కెప్టెన్ రోవ్మన్ పావెల్ మాట్లాడాడు. పపువా న్యూగినియా జట్టును కొనియాడాడు. ప్రత్యర్థి జట్టు గొప్పగా పోరాడిందని అన్నాడు. తమ గెలిచినప్పటికీ కొన్ని తప్పిదాలు చేశామని, తర్వాతి మ్యాచ్లో వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తామని పేర్కొన్నాడు. జట్టు విజయంలో రోస్టన్ ఛేజ్ కీలక పాత్ర పోషించాడని తెలిపాడు. బంతితో పాటు బ్యాటుతో సత్తాచాటాడని అన్నాడు.
''పపువా న్యూ గినియా టీమ్కు క్రెడిట్ ఇవ్వాలి. సింపుల్ ప్లాన్స్తో వచ్చి మంచి క్రికెట్ ఆడారు. మేం భావించిన స్కోరు కంటే 10-15 పరుగులు అదనంగా సాధించారు. స్మార్ట్ క్రికెట్ ఆడారు. మా బౌలింగ్ గ్రూప్ దీనిపై శ్రమించాలి. రోస్టన్ ఛేజ్ మొదట బంతితో అలరించాడు. ఆ తర్వాత ఒత్తిడితో కూడిన ప్రపంచకప్ మ్యాచ్ ఛేదనలో ప్రశాంతతో ఉంటూ సత్తాచాటాడు. అయితే మేం మా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. 60-70 శాతం మాత్రమే ఆడాం. వచ్చే మ్యాచ్లో పూర్తి సామర్థ్యంతో ఆడతామని ఆశిస్తున్నాం'' అని పావెల్ పేర్కొన్నాడు.