ముగిసిన విండీస్-ఆసీస్ టూర్..
టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ ఛాంపియన్గా నిలిచిన వెస్టిండీస్పై ప్రస్తుతం అందరి దృష్టీ నిలిచింది. ఆస్ట్రేలియాతో టీ20, వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్ను ముగించుకుంది. మూడో వన్డేలో ఓటమి ఫలితంగా వన్డే సిరీస్ను 2-1 తేడాతో కోల్పోయింది. వెస్టిండీస్ టూర్ను ముగించుకున్న కంగారూ టీమ్.. అటు నుంచి అటే బంగ్లాదేశ్కు వెళ్లాల్సి ఉంది. బంగ్లాదేశ్తో అయిదు టీ20 మ్యాచ్లను ఆడుతుంది అలెక్స్ క్యారీ సారథ్యంలోని ఆసీస్ జట్టు. ఈ సిరీస్ ఆగస్టు 3వ తేదీన ఆరంభమౌతుంది. 3,4,6,7,9 తేదీల్లో ఢాకా వేదిక ఈ మ్యాచ్లు కొనసాగుతాయి.
విండీస్-పాక్ మధ్య ఎన్ని మ్యాచులు?
ఆసీస్తో టూర్ను ముగించుకున్న వెస్టిండీస్.. పాకిస్తాన్తో తలపడబోతోంది. పాకిస్తాన్ జట్టు వెస్టిండీస్లో పర్యటిస్తుంది. ఈ పర్యటన ఈ నెల 28వ తేదీ నుంచి ఆరంభమౌతుంది. పాకిస్తాన్తో నాలుగు టీ20లు, రెండు టెస్ట్ మ్యాచ్లను ఆడుతుంది విండీస్. కింగ్స్టన్ ఓవల్, బ్రిడ్జ్టౌన్, బార్బడోస్లల్లో ఈ సిరీస్ ఉంటుంది. నిజానికి అయిదు టీ20లను ఆడాల్సి ఉన్నప్పటికీ.. ఆస్ట్రేలియాతో రెండో వన్డే వాయిదా పడటంతో షెడ్యూల్ బిజీగా మారింది. ఫలితంగా- ఒక మ్యాచ్లో కోత పెట్టింది వెస్టిండీస్ క్రికెట్ బోర్డు. అయిదు మ్యాచ్లను నాలుగుకు కుదించింది.
టీ20 సిరీస్ ఎప్పుడు..ఏఏ వేదికల్లో మ్యాచులు?
వెస్టిండీస్-పాకిస్తాన్ మధ్య తొలి మ్యాచ్ ఈ నెల 28వ తేదీన ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ప్రకారం.. సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమౌతుంది. బార్బడోస్ బ్రిడ్జ్టౌన్ స్టేడియం ఈ మ్యాచ్ కోసం వేదికగా మారింది. రెండో టీ20 జులై 31వ తేదీన రాత్రి 8:30 గంటలకు మొదలవుతుంది. గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో రెండు జట్లు తలపడతాయి. మూడో టీ20 ఆగస్టు 1వ తేదీన రాత్రి 8:30 గంటలకు ఇదే స్టేడియంలో ఉంటుంది. చివరిదైన నాలుగో టీ20 ఆగస్టు 4వ తేదీన గయానాలోనే రాత్రి 8:30లకు ఆరంభమౌతుంది. దీనితో టీ20 సిరీస్ ముగుస్తుంది.
టెస్ట్ సిరీస్ వివరాలేంటీ?
టీ20 సిరీస్ ముగిసిన వెంటనే వెస్టిండీస్-పాకిస్తాన్ జట్లు రెండు టెస్ట్ మ్యాచ్లను ఆడాల్సి ఉంది. ఆగస్టు 12 నుంచి 16 వరకు భారత కాలమానం ప్రకారం.. రాత్రి 8:30 గంటలకు తొలి టెస్ట్ మ్యాచ్ జమైకా కింగ్స్టన్లోని సబీనా పార్క్లో ఆరంభమౌతుంది. రెండో టెస్ట్ 20వ తేదీన ప్రారంభమౌతుంది. ఇదే సబీనా పార్క్ దీనికి వేదిక. భారత అభిమానులు సాధారణంగా వెస్టిండీస్ మ్యాచ్లను చూడాలంటే రాత్రంతా మేలుకోవాల్సి ఉంటుందనే విషయం తెలిసిందే. భారత్లో ఫ్యాన్కోడ్ యాప్ ఈ మ్యాచ్లన్నింటినీ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఈ సిరీస్ను బ్రిటన్కు చెందిన బీటీ స్పోర్ట్ ప్రసారం చేసే అవకాశం ఉంది. అమెరికాలో ఇఎస్పీఎన్ ప్లస్ ఛానల్స్.. దీన్ని లైవ్ టెలికాస్ట్ చేయొచ్చు.
రెండు జట్ల కూర్పులు ఎలా ఉన్నాయి?
వెస్టిండీస్ జట్టులో పెద్దగా మార్పులేవీ ఉండకపోవచ్చు. ఆసీస్తో సిరీస్ ఆడిన జట్టునే దాదాపు ఖరారు చేయడానికి అవకాశం ఉంది. కీరన్ పొల్లార్డ్ జట్టుకు నేతృత్వాన్ని వహిస్తాడు. నికొలస్ పూరన్ (వికెట్ కీపర్), ఫ్యాబియన్ అల్లెన్, డ్వేన్ బ్రావో, షెల్డన్ కాట్రెల్, ఫిడెల్ ఎడ్వర్డ్స్, ఆండ్రీ ఫ్లెచర్, క్రిస్ గేల్, షిమ్రోన్ హిట్మెయిర్, జేసన్ హోల్డర్, అకీల్ హొసేన్, ఎవిన్ లెవిస్, ఒబెడ్ మెక్కే, లెండిల్ సిమ్మన్స్, కెవిన్ సిన్క్లెయిర్, ఒషానె థామస్, హెడెన్ వాల్ష్.
పాక్ టీమ్ ఇలా..
పాకిస్తాన్ జట్టుకు బాబర్ ఆజమ్ కేప్టెన్గా ఉంటారు. షాదాబ్ ఖాన్, అర్షద్ ఇక్బాల్, అజమ్ ఖాన్, ఫహీమ్ అష్రాఫ్, ఫకర్ జమాన్, హ్యారిస్ రవూఫ్, ఇమద్ వసీం, మహ్మద్ హఫీజ్, మహ్మద్ హస్నయిన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, సర్ఫరాజ్ అహ్మద్, షహీన్ అఫ్రిది, షర్జీల్ ఖాన్, ఉస్మాన్ ఖాదిర్, హసన్ అలీ, మహ్మద్ వసీం జూనియర్, షోయబ్ మక్సూద్కు చోటు దక్కే అవకాశం ఉంది. దాదాపుగా ఇవే జట్లు టీ20 ప్రపంచకప్కు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.