సెయింట్ లూసియా వేదికగా ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టీ20లో వెస్టిండీస్ అయిదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సొంతగడ్డపై జరుగుతున్న అయిదు టీ20ల సిరీస్ను రెండు మ్యాచ్లు మిగిలుండగానే కోల్పోయినప్పటికీ నామమాత్రపు మ్యాచ్ల్లో చెలరేగుతోంది. 219 పరుగుల భారీ లక్ష్యాన్ని ఓవర్ మిగిలుండానే ఛేదించి పరువు కాపాడుకుంది. స్వదేశంలో తమ అత్యుత్తమ ఛేదనతో వెస్టిండీస్ రికార్డు నెలకొల్పింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 218 పరుగులు చేసింది. జాకోబ్ బెతెల్ (62 నాటౌట్; 32 బంతుల్లో, 4 ఫోర్లు, 5 సిక్సర్లు), ఫిలిప్ సాల్ట్ (55; 35 బంతుల్లో, 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకాలతో సత్తాచాటారు. విల్ జాక్స్ (25; 12 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు), సామ్ కరన్ (24; 13 బంతుల్లో, 2 సిక్సర్లు) దూకుడుగా పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో మొటియ్ రెండు వికెట్లు, రోస్టన్ ఛేజ్, అల్జారీ జోసెఫ్ చెరో వికెట్ తీశారు.

అనంతరం ఛేదనలో వెస్టిండీస్ 19 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. ఓపెనర్లు ఎవిన్ లూయిస్ (68; 31 బంతుల్లో, 4 ఫోర్లు, 7 సిక్సర్లు), షై హోప్ (54; 24 బంతుల్లో, 7 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడారు. కెప్టెన్ పావెల్ (38; 23 బంతుల్లో, 2 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫెర్పేన్ రూథర్ఫర్డ్ (29 నాటౌట్; 17 బంతుల్లో, 3 సిక్సర్లు) కీలక పరుగులు సాధించారు. ఇంగ్లండ్ బౌలర్లలో రెహాన్ అహ్మద్ మూడు వికెట్లు తీశారు.
అయితే ఛేదనలో తొలి రెండు ఓవర్లలో వెస్టిండీస్ స్కోరు 5/0 మాత్రమే. ఆ సమయంలో విండీస్ విన్నింగ్ ఛాన్స్ 8.37% గానే చూపించింది. కానీ ఆ తర్వాత లూయిస్-హోప్ విజృంభించడంతో సమీకరణం మారిపోయింది. కాగా, సొంతగడ్డపై వెస్టిండీస్కు పరుగుల పరంగా ఇదే అత్యుత్తమ ఛేదన. అంతకుముందు 2017లో భారత్పై ఛేజింగ్ చేసిన 191 పరుగులే అత్యుత్తమంగా ఉండేది.