టెస్టుల్లో గెలిచీ..
ప్రస్తుతం వెస్టిండీస్.. బంగ్లాదేశ్తో మూడు ఫార్మట్ల క్రికెట్ మ్యాచ్లను ఆడుతోంది. రెండు టెస్ట్ మ్యాచ్లల్లో విజయదుందుభి మోగించింది. భారీ తేడాతో వాటిని సొంతం చేసుకుంది. ఆ వెంటనే ఆరంభమైన టీ20 సిరీస్లోనూ అదే దూకుడును కొనసాగించింది. సిరీస్ను కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్ల సిరీస్ ఇది. తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. రెండు, మూడు మ్యాచ్లను విండీస్ వీరులు ఏకపక్షంగా మార్చివేశారు.
మూడో టీ20లో..
తాజాగా జార్జ్టౌన్లోని ప్రావిడెన్స్ పార్క్ స్టేడియంలో జరిగిన మూడో టీ20ని అయిదు వికెట్ల తేడాతో గెలుచుకుంది. 2-0 ఆధిక్యతతో సిరీస్ను గెలుచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఓపెనర్ లిట్టన్ దాస్-49, మిడిలార్డర్ బ్యాటర్ అఫీఫ్ హొస్సెన్ 50 పరుగులు చేశారు. వీరిద్దరు తప్ప మిగిలిన బ్యాటర్లెవరూ రాణించలేదు. అనాముల్ హక్-10, షకిబుల్ హసన్-5, చివర్లో కేప్టెన్ మహ్మదుల్లా 22 పరుగులు చేశారు.
74 పరుగులతో..
విండీస్ బౌలర్లల్లో హెడెన్ వాల్ష్ రెండు, ఒడియన్ స్మిత్, రొమారియో షెప్పర్డ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ ప్రారంభంలోనే వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ బ్రెండన్ కింగ్, వన్డౌన్ బ్యాటర్ షమారా బ్రూక్స్, ఒడియన్ స్మిత్, రౌమన్ పావెల్ త్వరగానే అవుట్ అయ్యారు. 43 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన దశలో కేప్టెన్ నికొలస్ పూరన్ రంగ ప్రవేశం చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్ల భరతం పట్టాడు. 39 బంతుల్లో అయిదు ఫోర్లు, అయిదు సిక్సర్లతో 74 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.
ఎల్లుండి నుంచి వన్డే..
ఓపెనర్ కైలే మెయర్స్ 38 బంతుల్లో అయిదు సిక్సర్లు, రెండు ఫోర్లతో 55 పరుగులు చేశాడు. 20 ఓవర్లల్లో అయిదు వికెట్లను కోల్పోయి 169 పరుగులు చేసింది విండీస్. ఇక ఈ రెండు జట్ల మధ్య ఎల్లుండి నుంచి వన్డే ఇంటర్నేషనల్స్ ఆరంభమౌతాయి. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం సాయంత్రం 7 గంటలకు తొలి వన్డే ఉంటుంది. 13, 16 తేదీల్లో మిగిలిన రెండు వన్డేలు ఉంటాయి. అనంతరం వెస్టిండీస్.. భారత జట్టును ఎదుర్కొంటుంది.
భారత-విండీస్ మధ్య..
భారత్-వెస్టిండీస్ మధ్య మూడు వన్డే ఇంటర్నేషనల్స్, అయిదు టీ20 మ్యాచ్ల సిరీస్ ఉంటుంది. ఈ సిరీస్ నేపథ్యంలో వెస్టిండీస్ జట్టు బంగ్లాదేశ్పై వరుస విజయాలను సాధిస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సిరీస్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఇదివరకే జట్టును కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టుు శిఖర్ ధావన్ సారథ్యాన్ని వహించనున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్, జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతి ఇచ్చారు.


Click it and Unblock the Notifications












