రెండో వన్డే ఎఫెక్ట్..
ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు వెస్టిండీస్లో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. అలెక్స్ క్యారీ సారథ్యంలోని ఆసీస్ జట్టు విండీస్ను ఢీ కొంటోంది. ఈ రెండు జట్ల మధ్య టీ20 సిరీస్ ముగిసింది. ఇక వన్డే ఇంటర్నేషనల్స్ ఆరంభం అయ్యాయి. తొలి వన్డేలో దారుణ పరాజయాన్ని చవి చూసింది కరేబియన్ టీమ్. విండీస్ కాలమానం ప్రకారం.. రెండో డే/నైట్ వన్డే గురువారం మధ్యాహ్నం ప్రారంభం కావాల్సి ఉండగా.. చిట్టచివరి నిమిషంలో అది రద్దయింది. గ్రౌండ్లో అడుగు పెట్టిన ఆటగాళ్లందరూ మళ్లీ డ్రెస్సింగ్ రూమ్లకు చేరుకోవాల్సి వచ్చింది.
కరోనా కలకలం..
దీనికి కారణం- కరోనా వైరస్. వెస్టిండీస్ జట్టు సపోర్టింగ్ టీమ్లో ఒకరికి కరోనా వైరస్ సోకడం వల్ల మ్యాచ్ను సస్పెండ్ చేయాల్సి వచ్చింది. ఈ విషయాన్ని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు, క్రికెట్ ఆస్ట్రేలియా ఉమ్మడిగా ధృవీకరించాయి. బ్రిడ్జిటౌన్లోని కెన్సింగ్టన్ ఓవల్ గ్రౌండ్లో మ్యాచ్ ప్రారంభం కావడానికి కొన్ని క్షణాల ముందు మ్యాచ్ను సస్పెండ్ చేసినట్లు తెలిపాయి.
క్రికెటర్లు, సపోర్టింగ్ టీమ్, మ్యాచ్ రెఫరీ, అంపైర్లు.. ఇలా ప్రతి ఒక్కరూ డ్రెస్సింగ్ రూమ్లకు పరిమితం అయ్యారు. ఆ సపోర్టింగ్ స్టాఫ్తో కాంటాక్ట్ అయిన వారి గురించి ఆరా తీస్తోన్నారు. అనుమానితులందరినీ ఐసొలేషన్లోకి పంపించారు.
టాస్ పడ్డ తరువాతా..
టాస్ పడిన తరువాత కూడా మ్యాచ్ రద్దయిందంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా క్రికెట్ మ్యాచ్లల్లో టాస్ పడిన అరగంట తరువాత మ్యాచ్ ఆరంభమౌతుంటుంది. ఇఫ్పుడా అరగంటే విషమంగా పరిణమించింది. టాస్ పడిన తరువాత రెండు జట్ల కేప్టెన్లు డ్రెస్సింగ్ రూమ్లకి వెళ్లిపోయారు.
జట్టుతో కలిసి గ్రౌండ్లో అడుగు పెట్టే దశలో వారికి కరోనా పాజిటివ్ సమాచారం అందింది. అంపైర్లకు తొలుత ఈ సమాచారం చేరవేశారు. వారి ద్వారా రెండు జట్ల కేప్టెన్లు, మ్యాచ్ రెఫరీ, టీమ్ మేనేజ్మెంట్స్కు సమాచారం వెళ్లింది. ఆ వెంటనే రెండు జట్ల క్రికెటర్లు.. హోటల్కు వెళ్లిపోయారు. సెయింట్ లూసియా, బార్బడొస్ హోటళ్లలో వారు బస చేస్తోన్నారు.
సిరీస్ రద్దయినట్టే..
ఈ సిరీస్తో ముడిపడి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఐసొలేషన్కు పంపించినట్లు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తెలిపింది. బయో బబుల్ ఎక్కడ బ్రీచ్ అయిందనే విషయంపై ఆరా తీస్తోన్నట్లు పేర్కొంది. ఈ పరిణామాలతో ఇక ఆస్ట్రేలియా.. వెస్టిండీస్ పర్యటనపై అనుమానాలు ఏర్పడ్డాయి. ఈ సిరీస్ ఇక్కడితో స్తంభించిపోయే అవకాశాలు ఉన్నాయి.
ఈ రెండు జట్ల మధ్య మూడోవన్డే శనివారం జరగాల్సి ఉంది. దాన్ని కూడా రద్దు చేయొచ్చని తెలుస్తోంది. వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్ల క్రికెటర్లు సైతం ఐసొలేషన్లోకి వెళ్లవచ్చని ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. వారు బస చేసిన హోటళ్లలోనే క్వారంటైన్కు వెళ్తారని సమాచారం.